Vinod Kumar | కరీంనగర్ : కరీంనగర్ వేదికగా జరగబోయే బీఆర్ఎస్ కదనభేరికి భారీగా కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలిరావాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ నెల 12న సాయంత్రం 4 గంటల సమయంలో ఎస్ఆర్ఆర్ మైదానం నుంచి పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. కదనభేరి బహిరంగ సభ వేదిక నుంచి వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినట్లే.. గత పదేండ్లలో కేంద్రంపై పోరాటం చేసి తెలంగాణ హక్కులను సాధించుకున్నాం. ఇది తెలంగాణ ప్రజలకు తెలుసు. ఢిల్లీలో బీజేపీ, తెలంగాణలో కాంగ్రెస్ ఉంది. మరి బీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. వారికి ధీటుగా సమాధానం కేసీఆర్ చెప్తారు. ఎందుకంటే గులాబీ జెండా ఎంపీలు పార్లమెంట్లో తమ గళాన్ని విప్పి ఎన్నో సాధించుకున్నారు. ఇప్పుడు మరింత అవశ్యకత ఉన్నది. తెలంగాణ స్పృహ, సోయి ఉండాల్సిన ఎంపీలు ఢిల్లీలో ఉండాల్సిన అవసరం ఉందని వినోద్ కుమార్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటింది. మేడిగడ్డలో మూడు పిల్లర్లు కుంగి.. మూడు నెలలు గడుస్తున్నా.. ఇంకా పనులు మొదలు పెట్టలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ జెండా గెలిచి ఉంటే, కేసీఆర్ సీఎం అయి ఉంటే.. మేడిగడ్డలో కుంగిన పిల్లర్ల వద్ద పనులు మొదలు పెట్టి.. పూర్తి చేసేవారు. మిడ్ మానేరు, ఎల్ఎండీ నింపుకుని పంట పొలాలకు నీళ్లు ఇచ్చేవాళ్లం. తెలంగాణ గుండెతోని ఆలోచిస్తేనే తెలంగాణ సమస్యలు అర్థమవుతాయి. ప్రజలకు ఏది అత్యవసరం అనేది ఆలోచించాలి. పంట పొలాలు ఎడిపోతుంటే రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కొంతమంది రైతులు ఎండిపోతున్న పంటకు నిప్పు పెడుతున్నారని తెలిసింది. ఏడుపు వస్తున్నది. ఎందుకు ఈ తెలంగాణకు గోస. కేసీఆర్ ఉంటే అడ్డు పడైనా నీళ్లు తీసుకోచ్చేవారని రైతులు అంటున్నారని వినోద్ కుమార్ తెలిపారు.
వంద రోజుల పరిపాలనలో సాగునీరు ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుబంధు రైతుకు అవసరం ఉన్నప్పుడు ఇవ్వాలి. మరి రైతులకు రైతుబంధు పంపిణీలో, నీళ్ల పంపకాల్లో ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయాలపై రేపు కేసీఆర్ బహిరంగ సభలో ప్రస్తావిస్తారు. మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి.. తెలంగాణ గొంతు వినిపించాలి. రేపటి సభకు సిరిసిల్ల, హుస్నాబాద్, మానకొండూరు, వేములవాడ, చొప్పదండి, హుజురాబాద్, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను దిగ్విజయం చేయాలని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.