Jeevan Reddy | హైదరాబాద్ : చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విరుచుకుపడ్డారు. రంజిత్ రెడ్డి చప్రాసీ ఉద్యోగానికి కూడా పనికిరాడు అని తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్లో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
రంజిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసింది. కోళ్లు, గుడ్లు అమ్ముకునే రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీని చేశారు కేసీఆర్. ఆయన జీవితంలో చప్రాసీ కూడా కాలేడు. ఆ ఉద్యోగానికి కూడా పనికిరాడు. నువ్వే నా గురువు, నువ్వే నా ఫాదర్ అని రోజు కేసీఆర్కు చెప్పేవాడు. నా కన్న తండ్రి కంటే కేసీఆరే గొప్ప అని చెప్పాడు. అక్రమాస్తులను కాపాడుకునేందుకే రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. విశ్వాస ఘాతకుడు రంజిత్ రెడ్డి. ఈయన డాక్టర్ రంజిత్ రెడ్డి కాదు.. కోళ్లకు సూదులిచ్చే డాక్టర్ రంజిత్ రెడ్డి. కోళ్ల దాణా అమ్మి.. 300 ఎకరాల భూములు గుంజుకున్నాడు. చాలా మందిని మోసం చేసిండు.. ఆ జాబితా కూడా త్వరలోనే బయటపెడుతాను. చేవేళ్ల ఆయన ఊరు కాదు. కరీంనగర్లో పుట్టిండు.. వరంగల్లో బతికిండు. హైదరాబాద్లో కోళ్ల దుకాణం పెట్టాడు. ఆయనకున్న ఆస్తులను అఫిడవిట్లో పొందుపరచలేదు. కేసులు పెడుతారని భయపడి కాంగ్రెస్లోకి వెళ్లారు. ఇవాళ ఎలాగైతే కేసీఆర్ను మోసం చేసిండో.. రేపు రేవంత్ను కూడా అలాగే మోసం చేస్తాడు అని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు.