నిజామాబాద్, ఏప్రిల్ 7: కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్ సెక్రటేరియట్లో షాడో సీఎంగా సమీక్షలు చేస్తుంటే.. డమ్మీ సీఎంగా మారిన రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో గోళ్ళు గిల్లుకుంటున్నారని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
నిజామాబాద్లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వాపార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రాజ్యాంగేతర శక్తుల ప్రమేయం పెరిగిందని అన్నారు.
ఏఐసీసీ పెద్దల దృష్టిలో సీఎం రేవంత్ బీజేపీ కోవర్ట్ అని అన్నారు. రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ నమ్మడం లేదని, అందుకే రేవంత్ తోక కత్తిరించి పక్కనబెట్టారని పేర్కొన్నారు. రేవంత్ను అదుపు చేయడానికి రాహుల్ దూతగా మీనాక్షి నటరాజన్ రాష్ట్రానికి వచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జీ హోదాలో రాష్ట్రానికి వచ్చిన మీనాక్షి నటరాజన్.. ఏ హోదాలో సచివాలయంలోకి అడుగుపెట్టారని నిలదీశారు. గాంధీ భవన్లో సమీక్షలు పెట్టాల్సిన మీనాక్షి నటరాజన్ సచివాలయంలో.. సచివాలయంలో సమీక్షలు పెట్టాల్సిన సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్షలు చేస్తుండటం వింతగా ఉందని విమర్శించారు.
తెలంగాణ ఆత్మ గౌరవాన్ని డిల్లీ పెద్దలకు తాకట్టు పెట్టిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సిగ్గుతో తలదించుకోవాలని జీవన్ రెడ్డి మండిపడ్డారు. సీఎం పోస్ట్ కాపాడుకునేందుకే బడే బాయ్తో చోటే బాయ్ దోస్తీ కట్టారని విమర్శించారు. ప్రధాని మోదీతో డీల్ చేసుకొని తెలంగాణలోని యూనివర్సిటీల భూములను రేవంత్ రెడ్డి అమ్మకానికి పెట్టారని జీవన్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ అరవింద్ త్రయం రేవంత్ కు రక్షణ కవచంగా నిలుస్తున్నారని అన్నారు.
సంక్షేమ పథకాలు కిల్ ..సంక్షోభం ఫుల్
తెలంగాణలో కాంగ్రెస్ను గెలిపించినందుకు జనం బాధపడుతున్నారని జీవన్ రెడ్డి అన్నారు. ఇంటి పార్టీ బీఆర్ఎస్ను ఓడించి తప్పు చేశామన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతున్నదని తెలిపారు. రేవంత్ రెడ్డి అంటేనే అబద్ధాల డంపు, అవినీతి కంపు అని విమర్శించారు. కాంగ్రెస్ పాలన అంటేనే ఆగమాగమని అన్నారు. ఎన్నికల హామీలలో దాదాపు అన్నింటికీ ఎగనామం పెట్టారని.. అరకొర పథకాలు సగం సగం అమలవుతున్నాయని అన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా సగంసగం అమలు చేసి మహాలక్ష్మి పథకానికి, కళ్యాణ లక్ష్మీ, తులం బంగారానికి ఎగనామం పెట్టారని అన్నారు. మహిళల ఉచిత ప్రయాణ బస్ మధ్యలోనే మిస్ అవుతోందన్నారు. .
ఇందిరమ్మ రాజ్యమంటేనే హామీల అమలుకు సమాధి. అవినీతి, అక్రమాలకు పునాది అని ఎద్దేవా చేశారు. తన పాలనకు రెఫరెండంగా కాంగ్రెస్కు ఓటేయాలని ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి అడిగారని.. కానీ ప్రజలు చిత్తుచిత్తుగా ఓడగొట్టారని గుర్తుచేశారు.
గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బడే భాయ్ కోసం ఛోటే భాయ్ తోఫా ఇచ్చాడని జీవన్ రెడ్డి అన్నారు. అమ్ముడుపోవడం రేవంత్ రెడ్డికి అలవాటేనని అన్నారు. కేసీఆర్ అంటే నమ్మకం.. మోదీ, రేవంత్ రెడ్డి అంటే అమ్మకం అని సెటైర్ వేశారు. అమ్మకాలలో బడేభాయ్, ఛోటే భాయ్ పోటీ పడుతున్నారని అన్నారు. బడే భాయ్ పోర్టులు, ఎయిర్ పోర్టులు అమ్ముతుంటే.. ఇక్కడ చోటే బాయ్ రేవంత్ రెడ్డి యూనివర్సిటీల భూములు అమ్ముతున్నాడని అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్ముకోనిస్తే రేవంత్ కు పట్టపగ్గాలుండవని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల భూముల అమ్మకాలు అయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కళాశాలల భూములు అమ్మాలని కుట్ర చేస్తుండు అని అన్నారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇప్పటికే నిజామాబాద్, ఆర్మూర్ తదితర ప్రాంతాల్లో గల కాలేజీల పరిధిలో ఎన్ని భూములున్నాయన్న అంశంపై కూడా అధ్యయనం చేయించినట్టు తెలిసిందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను ముంచినట్టే విద్యార్థుల నోటిలో కూడా మట్టి కొట్టడానికి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడని మండిపడ్డారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములను ఎవరైనా కొంటె బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తిరిగి స్వాధీనం చేసుకుంటామని కేటీఆర్ చేసిన ప్రకటన కాంగ్రెస్ నాయకులకు వణుకు పుట్టిస్తోందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకం రేవంత్ రెడ్డి భూముల అమ్మకాలపై తిరగబడాలి అని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు.