Jagadish Reddy | సూర్యాపేట, మే 4 : కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా ఇచ్చినట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని గెలిపించాలని కోరుతూ శనివారం రాత్రి సూర్యాపేటలో జగదీశ్రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి రైతు భరోసాపై చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఐదు నెలలుగా సతాయించడమేగాక ఇప్పుడు 65 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చాను.. వంద శాతం ఇస్తానని అబద్ధ్దాలు చెప్పేందుకు సిగ్గు ఉండాలని అన్నారు. ఐదు నెలలు ఆలస్యం చేసి రైతులను అప్పుల పాలు చేసినందుకు రేవంత్ ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. ‘రైతుబంధు నువ్వు ఇచ్చేదేంది? అది రైతుల హక్కు.. నువ్వేదో పెద్ద దానం ఇచ్చినట్టు పోజులు కొడుతున్నావ్.. కేసీఆర్ను చాలెంజ్ చేస్తున్నావ్.
మోదీ నల్ల చట్టాలు తెచ్చి చెంపలు వేసుకున్నట్టే.. నువ్వు కూడా రైతులందరికి రైతుభరోసా ఇచ్చి పాపప్రక్షాళన చేసుకోవాలి. స్వయానా మీ వ్యవసాయ శాఖ మంత్రే రైతుబంధు రాలేదని చెప్పిన తరువాత ప్రజల్లో పలుచనై తప్పించుకునే పరిస్థితి లేదని గ్రహించి ఇవాళ ఇస్తామంటున్నారు’ అని జగదీశ్రెడ్డి విమర్శించారు. మరో మంత్రి రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతానంటాడని, ఈ నెల 13న చెప్పులతో బుద్ధి చెప్పేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని స్పష్టంచేశారు. అసెంబ్లీ ఎన్నికలకు, ఇప్పటికీ కాంగ్రెస్ గ్రాఫ్ 10 శాతానికిపైగా పడిపోయిందని తెలిపారు. కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి మందలింపులు, ప్రజల నుంచి ఈసడింపులు వస్తున్నాయన్న భయంతోనో రెండు రోజులుగా కొంత మారినట్టు కనిపిస్తున్నా.. రేవంత్ అబద్ధాలకు అడ్డూఅదుపు ఉండదన్నారు. 65 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చినట్టు చెప్తున్న రేవంత్రెడ్డి ఒక్కరంటే ఒక్కరికి ఇచ్చినట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. రేవంత్రెడ్డి రైతుభరోసా ప్రారంభించలేదు.. కేవలం రైతుబంధును కొనసాగించారని స్పష్టంచేశారు. అదీ అప్పుడే కేసీఆర్ రూ.500 కోట్లు సిద్ధం చేస్తే రైతాంగానికి ఇవ్వకుండా అడ్డుపడి అధికారంలోకి వచ్చాక వాటిని కాంట్రాక్టర్లకు పంచారని విమర్శించారు.