BRS | హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): దేశంలో సుదీర్ఘకాలంపాటు అధికారంలో ఉన్న రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికీ అన్ని నియోజకవర్గాల్లో తమ సొంత అభ్యర్థులను నిలబెట్టుకోలేని దుస్థితిని ఎదుర్కొంటున్నాయి. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఆ పార్టీలు అన్ని నియోజకవర్గాల్లో బలమైన నాయకులను తయారుచేసుకోలేకపోయాయన్న విమర్శను చవిచూస్తున్నాయి.
ఈ రెండు పార్టీలు రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు బలమైన సొంత అభ్యర్థులు లేక బీఆర్ఎస్పైనే ఆధారపడుతున్నాయని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ అభ్యర్థుల్లో బీజేపీ లేదా ఆ పార్టీ అనుబంధ సంఘాల్లో రాజకీయ ఓనమాలు దిద్దుకొని ఎదిగినవారెందరు? ఇటీవల కాలంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారెంతమంది? ఇలా పార్టీలో చేరగానే అలా టికెట్లు దక్కించుకున్నవారెంతమంది? అనే చర్చ ఆసక్తిగా సాగుతున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదీ అదే పరిస్థితి.
పార్లమెంట్ ఎన్నికల్లో తమకు సరైన అభ్యర్థులు లేకపోవడంతో బీఆర్ఎస్లోని ముఖ్యనేతలను ఆకర్షించేందుకు కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా ప్రయత్నిస్తున్నాయి. బీఆర్ఎస్కు చెందిన ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు బీబీ పాటిల్, రంజిత్రెడ్డి, పసునూరి దయాకర్, పోతుగంటి రాములు, వెంకటేశ్ నేతను కాంగ్రెస్, బీజేపీ తమతమ పార్టీల్లో చేర్చుకున్నాయి. బీజేపీ ప్రకటించిన 15 మంది అభ్యర్థుల్లో ఏడుగురు (ఈటల రాజేందర్, బూర నర్సయ్యగౌడ్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, బీబీ పాటిల్, అజ్మీరా సీతారాంనాయక్, సైదిరెడ్డి, రఘునందన్రావు (పూర్వాశ్రమంలో బీజేపీతో సంబంధాలున్నా) బీఆర్ఎస్తో రాజకీయాల్లోకి వచ్చినవారే కావడం గమనార్హం.
ఇందులో గతంలో, ప్రస్తుతం బీఆర్ఎస్ను వీడినవారున్నారు. బీజేపీ కండువా కప్పుకోగానే సీట్లు పొందిన నేతల్లో గోడం నగేశ్ (ఆదిలాబాద్), అజ్మీరా సీతారాంనాయక్ (మహబూబాబాద్), బీబీ పాటిల్ (జహీరాబాద్), పోతుగంటి భరత్ (ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు, నాగర్కర్నూల్), సైదిరెడ్డి (నల్లగొండ) బీఆర్ఎస్ ద్వారా ఎదిగివచ్చిన నేతలే కావడం గమనార్హం. వీటితోపాటు వరంగల్ టికెట్ను కూడా బీఆర్ఎస్లో ఎదిగి, ఇటీవల బీజేపీలో చేరిన అరూరి రమేశ్కు కేటాయించినట్టు సమాచారం. కాంగ్రెస్ కూడా ఇటీవల బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ లో చేరిన రంజిత్రెడ్డి(చేవెళ్ల), దానం నాగేందర్(సికింద్రాబాద్), సునీతా మహేందర్రెడ్డి (మల్కాజిగిరి) టికెట్లు కేటాయించడం గమనార్హం. దశాబ్దాల చరిత్ర గల రెండు జాతీయ పార్టీలకు సరైన అభ్యర్థులే దొరకకపోడంతో బీఆర్ఎస్పై ఆధారపడటం చర్చనీయాంశంగా మారింది.