ఇల్లెందు, ఫిబ్రవరి 24 : యాసంగికి రైతుభరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం రొంపేడులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ప్లకార్డులతో మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు అజ్మీరా బావుసింగ్ మాట్లాడుతూ పదేండ్ల కేసీఆర్ పాలనలో పంటల పెట్టుబడికి రైతులు ఏనాడూ ఇబ్బందులు పడలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచినా రైతుభరోసా ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి సంక్రాంతికి, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుభరోసా వేస్తామని మాయమాటలతో మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.