KTR | హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశపర్చినా బాధేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. తాము ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదని, ప్రజలు అప్పగించిన ప్రతిపక్ష పాత్రను సమర్థంగా నిర్వర్తిస్తామని చెప్పారు. ప్రతిపక్ష పాత్రలో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని, కొత్త ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని స్పష్టంచేశారు. ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేశారు. అసెంబ్లీ ఫలితాల అనంతరం ఆదివారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. గత 100 రోజులుగా పార్టీ అభ్యర్థుల విజయానికి శ్రమించి, కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు వినమ్రపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు. 60 లక్షల మంది బీఆర్ఎస్ కుటుంబసభ్యులు బాగా కష్టపడ్డారని, పార్టీ కార్యకర్తలు, నాయకుల కృషి వల్లనే 39 సీట్లు గెలిచామని అన్నారు.
గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ఆశించామని, సీట్లు తక్కువగా రావడానికి కారణాలపై సమీక్షించుకుంటామని స్పష్టంచేశారు. గత పదేండ్లుగా ప్రభుత్వాన్ని ఎంత సమర్థంగా నడిపించామో.. ప్రతిపక్షంగా కూడా అంతే సమర్థంగా పనిచేస్తామని చెప్పారు. ఎదురుదెబ్బలను గుణపాఠంగా తీసుకొని నేర్చుకోవాల్సినవి నేర్చుకొని ముందుకు పోతామని స్పష్టంచేశారు. 23 ఏండ్లలో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయని, ఎత్తు పల్లాలు అన్నీ చూశామని వివరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనే లక్ష్యాన్ని సాధించామని, ఇప్పటివరకు చేసిన పని పట్ల సంతృప్తి ఉన్నదని పేర్కొన్నారు. అడుగడుగునా అండగా ఉన్న కార్యకర్తలకు, నాయకులకు, పదేండ్లుగా సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమని కేటీఆర్ పేర్కొన్నారు. స్థితప్రజ్ఞత అనేది రాజకీయాల్లో చాలా అవసరమని, గెలుపునైనా, ఓటమినైనా ఒకే రకంగా తీసుకోగలిగే ధీరోదాత్తత కేసీఆర్ తమకు నేర్పించారని చెప్పారు. కొంత బాధ ఉంటదని, బాధను దిగమింగి, గోడకు కొట్టిన బంతి ఎంత వేగంగా వెనక్కి వస్తదో అంతే వేగంతో వెనక్కి వచ్చినట్టుగా ప్రజల మన్ననలను తిరిగి పొందే విధంగా పనిచేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
గతంలో చేసిన దాని కంటే రెట్టింపు కష్టం చేస్తామని చెప్పారు. ఎవ్వరూ నిరాశకు లోనుకావాల్సిన, బాధ పడాల్సిన, అధైర్యపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఇలాంటివి జీవితంలో, రాజకీయాల్లో సర్వసాధారణమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారని, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వాన్ని బాగా నడపాలని మనసారా కోరుకుంటున్నామని చెప్పారు. కొత్త ప్రభుత్వాన్ని తొందర పెట్టే పని కూడా చేయబోమని, వారు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నామని అన్నారు. ప్రజల పక్షాన, ప్రజల గొంతుగా, మరింత దృఢ సంకల్పంతో పనిచేస్తామని, కాంగ్రెస్ హామీల అమలు కోసం ప్రజల పక్షాన పోరాడుతామని చెప్పారు.
ఎన్నికల ఫలితాలు స్పీడ్ బ్రేకర్లు మాత్రమేనని, చిన్న ఎదురుదెబ్బ మాత్రమేనని కేటీఆర్ చెప్పారు. కొందరు మంత్రులు అనుహ్యంగా ఓటమిపాలయ్యారని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ అన్ని సర్వశక్తులు ఒడ్డి పోరాటం చేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమీక్షలు, చిన్న మార్పులు, చేర్పులు చేసుకోవాల్సి ఉంటే చేసుకుందామని చెప్పారు. ఆనాడు ఎన్ని ప్రతికూలతల మధ్య ఉద్యమాన్ని నడిపామో మళ్లీ అదే రకమైన పోరాట స్పూర్తితో ధైర్యంగా ముందుకు పోదామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ శాసనసభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. బీఆర్ఎస్కు ప్రజలు ప్రతి జిల్లాలో ప్రాతినిధ్యం కల్పించారని అన్నారు.
ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ప్రజాతీర్పు శిరోధార్యం కాబట్టి ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిణతి ప్రదర్శించి కేసీఆర్ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్కు పంపించారని తెలిపారు. ఎన్నికల ఫలితాలు చూస్తే.. వేవ్ లాగా లేదని, రాష్ట్రం అంతా ఒకేరకమైన ఫలితాలు రాలేదని, గ్రేటర్ హైదరాబాద్, మెదక్ జిల్లాలో బీఆర్ఎస్కు అనుకూలంగా ఏకపక్షంగా తీర్పు ఇచ్చారని చెప్పారు.
దేవరకద్ర, తాండూరు, ఖానాపూర్లాంటి కొన్నిచోట్ల చాలా స్వల్ప మెజార్టీతో ఓడిపోయామని వివరించారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కానీ సింగరేణికిగాని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినంతగా ఎవ్వరు చేయలేదని, బోనస్, వారసత్వ ఉద్యోగాలు ఇచ్చామని, ప్రైవేటీకరణను అడ్డుకున్నామని, కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీకి అసాధారణమైన మెజార్టీ వచ్చిందని చెప్పారు. పార్టీ నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలతో మాట్లాడి ఓటమికి కారణాలను విశ్లేషిస్తామని తెలిపారు.