Congress | హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఎన్నికల నియామవళికి విరుద్ధంగా ఉన్న కాంగ్రెస పార్టీ ప్రకటనలను నిలిపివేయాలని బీఆర్ఎస్ కోరింది. ఈ విషయంలో ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులు వెంటనే అమలయ్యే విధంగా చూడాలని పేర్కొంది. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి భరత్కుమార్ నేతృత్వంలో పార్టీ లీగల్సెల్ బృందం బీఆర్కేఆర్ భవన్లో సోమవారం సీఈవో వికాస్రాజ్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) నిబంధనలకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ఎన్నికల ప్రకటనలను టీవీ చానళ్లలో ప్రసారం చేస్తున్నారని తెలిపింది. ఎంసీఎంసీకి చూపించింది ఒకటి, టీవీలలో ప్రసారం అయ్యేవి వేరొకటి అని ఆరోపించింది. దీనిపై తాము ఇంతకుముందు ఫిర్యాదుచేసినప్పుడు సదరు ప్రకటనలను నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చిందని, కాని అవి అమలు కావడవంలేదని తెలిపింది. ఆ ప్రకటనలు టీవీ చానళ్లలో ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని స్టార్ క్యాంపెయినర్గా ప్రచారం చేయకుండా నిషేధించాలని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రెచ్చగొట్టే ప్రసంగాలతో బీఆర్ఎస్ అభ్యర్థులపై దాడులను ప్రోత్సహిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. గత నెల 30న కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై కత్తితో దాడి చేశారని తెలిపారు. అచ్చంపేట బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై కూడా ఈ నెల 11న రాత్రి 10 గంటల ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీ కృష్ణ, అతని అనుచరుల దాడి చేశారని పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి రేవంత్రెడ్డి ఉద్దేశ పూర్వకంగా, రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తున్నారని, బీఆర్ఎస్ నాయకులు, అభ్యర్థులపై దాడులను ప్రోత్సహించే విధంగా ప్రసంగాలు చేస్తున్నారని వివరించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు, అభ్యర్థులపై భౌతికంగా దాడులకు పాల్పడుతున్నారని, దాడులకు ప్రయత్నిస్తున్నారని, దాడులను ప్రేరెపిస్తున్నారని ఆరోపించారు. కొత్త ప్రభాకర్రెడ్డి ఇంకా దవాఖానలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. తమ పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు గువ్వల బాలరాజు, కొత్త ప్రభాకర్రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ హత్యా ప్రయత్నం చేసిందని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను స్వేచ్ఛగా, ప్రశాంతంగా ప్రచారం చేసుకొనే అవకాశం కల్పించాలని కోరారు. గువ్వల బాలరాజుపై దాడి జరిగి 20 గంటలైనా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయాలేదని ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. దాడులకు పాల్పడిన కాంగ్రెస్ అభ్యర్థి స్వేచ్ఛగా తిరుగుతున్నారని, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.