హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డికి కొడంగల్, అచ్చంపేట నియోజకవర్గాల్లో రెండు చోట్ల రెండు ఓట్లు ఉన్నాయనే ఆరోపణలపై బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఇవో) సుదర్శన్రెడ్డిని కలిసి గురువారం ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ తక్షణమే స్పందించి, నిష్పక్షపాతంగా విచారణ జరుపాలని కోరింది. ఈ మేరకు బీఆర్ఎస్ సమన్వయ కమిటీ సభ్యులు అభిలాష్ రంగినేని, ముజీబుద్దీన్, సుమిత్రానంద్, నాయకురాలు మమత సీఈవోకు వినతిపత్రం అందజేశారు.
ఎపిక్ సంఖ్య టీఈఎస్0274035 కలిగిన ఓటర్ల జాబితా నమోదుపై టైమ్ స్టాంప్తో కూడిన ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని, తద్వారా ఓట్ల సృష్టి, మార్పులు, తొలగింపుల తేదీలను కచ్చితంగా నిర్ధారించాలని కోరారు. ముఖ్యమంత్రి తన నామినేషన్ అఫిడవిట్లలో కొండారెడ్డిపల్లి (అచ్చంపేట) ఓటు వివరాలను వెల్లడించారా? లేదా? అనేది పరిశీలించాలని, ఒకవేళ దాచిపెట్టినట్టు తేలితే, ఆర్పీ చట్టంలోని సెక్షన్ 31/125ఏ కింద చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్నికల కమిషన్ పరిధిలోని అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ శాఖలు లేదా అధికారులు మాట్లాడకుండా కఠిన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.