హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): నర్సాపూర్ గర్జించింది.. పటాన్చెరు జనం ప్రభంజనం.. దుండిగల్ గులాబీపూల వనం.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఒకేరోజు మూడు రోడ్షోలు.. ఒకదానిని మించి మరొకటి విజయవంతం.. ఉప్పొంగిన జనాభిమానం.. మొత్తంగా బుధవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్షో విజయవంతమైంది. బస్సుయాత్రకు ప్రజలు నీరాజనం పలికారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నర్సాపూర్, పటాన్చెరు, మేడ్చల్-మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని దుండిగల్లో నిర్వహించిన రోడ్ షోల్లో కేసీఆర్ పాల్గొన్నారు. సాయంత్రం ఏడు నుంచి రాత్రి 10 గంటల మధ్య జరిగిన ఆయా కార్యక్రమాల్లో కేసీఆర్ ప్రసంగించారు. బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించారు. కేసీఆర్ ఎర్రవల్లి నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించారు. గజ్వేల్ మీదుగా నర్సాపూర్కు చేరుకున్నారు. మార్గమధ్యంలో గజ్వేల్, తూప్రాన్, శివ్వంపేటలో జననేతను చూసేందుకు భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలిరాగా.. కేసీఆర్ కాసేపు బస్సును ఆపి వారికి అభివాదం చేసి ముందుకు సాగారు. సాయంత్రం 7 గంటలకు నర్సాపూర్ చేరుకున్నారు. కిక్కిరిసిన జనసందోహం మధ్య రోడ్షో మొదలై.. అంబేద్కర్ సర్కిల్కు చేరుకున్నది. జననేతను చూసేందుకు, ఆయన ప్రసంగం వినేందుకు వేలాది సంఖ్యలో ప్రజలు చౌరస్తాకు చేరుకున్నారు. దీంతో హైదరాబాద్ వైపు, మెదక్ వైపు, తూప్రాన్ వైపు, పటాన్చెరువైపు వెళ్లే రహదారులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. కేసీఆర్ను చూడగానే వారిలో ఉత్సాహం రెట్టించింది. ‘సీఎం సీఎం’ అన్న నినాదాలను హోరెత్తించారు. అనంతరం బస్సుయాత్ర మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుండిగల్ ఓఆర్ఆర్ చౌరస్తాకు చేరుకున్నది. వేలాది మంది జనం తరలివచ్చారు. అనంతరం బస్సుయాత్ర పటాన్చెరుకు చేరుకున్న ది. కేసీఆర్ బస్సు అంబేద్కర్ సర్కిల్కు చేరుకోగానే జనసందోహం ఉరకలెత్తి జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. మూడు చోట్ల అంతులేని ప్రజాభిమానం కనిపించగా, కేసీఆర్ అలుపులేకుండా రెట్టించిన ఉత్సాహంతో బస్సుయాత్ర, రోడ్షోలలో పాల్గొన్నారు.
కేసీఆర్ రోడ్షోలకు పోలీసుల నుంచి సహకారం కనిపించలేదు. ముఖ్యంగా నర్సాపూర్ చౌరస్తా నిత్యం రద్దీగా ఉంటుంది. కేసీఆర్ సభ నేపథ్యంలో వేలాది మంది తరలిరాగా, పోలీసులు ట్రాఫిక్ను నియంత్రించడంలో సహకరించలేదని స్థానిక నేతలు విమర్శించారు. దీంతో కార్యకర్తలే స్వయంగా ట్రాఫిక్ను నియంత్రించాల్సి వచ్చింది. పోలీసులు అక్కడక్కడా గుంపులుగా నిలబడి చూస్తుండటం కనిపించింది.
కేసీఆర్ ప్రసంగంలో వేసిన పంచులకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ముఖ్యంగా నర్సాపూర్లో మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డిని ఉద్దేశించిన కేసీఆర్ మాట్లాడుతూ.. ‘మహిళలకు 2,500 ఇస్తున్నామని రాహుల్గాంధీ అంటున్నరు. వచ్చిందా?’ అని కేసీఆర్ అడగగా ‘లేదు’ అంటూ ప్రజలు ముక్తకంఠంతో సమాధానం ఇచ్చారు. దీంతో ‘తెస్తాననే మదన్రెడ్డి కాంగ్రెస్ల సొచ్చిండంట కదా..? తేలేదా? మరీ మదన్రెడ్డి ఎందుకు కాంగ్రెస్లోకి పోయిండు’ అంటూ నిలదీశారు. ఆయన్ను రెండుసార్లు ఎమ్మెల్యే చేసింది కేసీఆరే కదా. ఎవరిని ఉద్ధరిద్దామని మదన్రెడ్డి కాంగ్రెస్లోకి పోయినట్టు’ అంటూ మండిపడ్డారు. వెంకట్రామిరెడ్డికి నర్సాపూర్ నుంచే 50 వేల మెజార్టీ ఇచ్చి మదనరెడ్డికి బుద్ధిచెప్పాలని కేసీఆర్ కోరగా.. ‘చెప్తామంటూ ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇక దుండిగల్లో చేసిన ప్రసంగంలోనూ ఈటలపై పంచులు విసిరారు. మోదీ వేస్తానన్న రూ.15 లక్షలు పడ్డాయా? అని అడగగా ప్రజలు ‘లేదు..’ అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో మీ మల్కాజిగిరిలో ఒక్కొక్కరికి రూ.30 లక్షలు వచ్చాయని ఈటల రాజేందర్ చెప్తున్నాడంటూ దెప్పిపొడిచారు. మోదీ, బీజేపీ ఎజెండాలో పేదల కష్టాలు ఉండవని, ధనికుల బాధలే ఉంటాయని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఆయా చో ట్ల ప్రసంగించిన కేసీఆర్ గత బీఆర్ఎస్ హ యాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ను వివరిస్తూ, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ పాలన వల్ల తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని విడమర్చి ప్రజల్లో ఆలోచనను రేకెత్తించారు.
కరెంటు కోతలు, నీళ్ల కొరతతో హైదరాబాద్ ఇమేజ్ను కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తున్నదని బీఆర్ఎస్ చీఫ్ కే చంద్రశేఖర్రావు ఆవేదన వ్యక్తంచేశారు. కొద్దిపాటి వర్షానికే నగరంలో ఆరు నుంచి 8 గంటల పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని పేర్కొన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు రెప్పపాటు సమయం కూడా కరెం టు పోలేదని, హైదరాబాద్ను పవర్ ఐ లాండ్లా తీర్చిదిద్దామని తెలిపారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుండిగల్లో బీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా బుధవారం నిర్వహించిన రోడ్షోలో కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో నాలుగైదు నెలల్లో పరిస్థితులు ఎంతగా తారుమారు అయ్యాయో అందరికీ తెలుసని పేర్కొన్నారు. పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీ లు డజనుమంది ఉంటే తెలంగాణ హక్కు లు కాపాడతారని, రాష్ర్టానికి నిధులు తీసుకొస్తారని వివరించారు. బీజేపీ అధికారంలోకి వచ్చి పదేండ్లు అయిందని, నరేంద్రమోదీ 150 నినాదాలు ఇచ్చారని, వాటిలో ఒక్కటీ అమలు కాలేదని విమర్శించారు.