KCR | హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ‘అధైర్యపడొద్దు. ధైర్యంగా ఉండండి. ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగుదాం’ అని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఉద్బోధించారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఆటుపోట్లు సహజమని, ఎన్నికల్లో ఓడిపోయినంతమాత్రాన ప్రజలకు దూరంగా ఉండటం నాయకుల లక్షణం కాదని పేర్కొన్నారు. గురువారం ఎర్రవల్లిలోని తన నివాసానికి వరుసగా నాలుగో రోజు కూడా పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు తరలివచ్చారు.
కేసీఆర్తో కలిసి ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. కేసీఆర్ను కలిసినవారిలో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, శేరి సుభాష్రెడ్డి, యెగ్గె మల్లేశం, గంగాధరగౌడ్, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, డీఎస్ రెడ్యానాయక్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేశ్గుప్తా, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, వీ ప్రకాశ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. అధైర్యపడొద్దని, భవిష్యత్తు కార్యాచరణపై దృష్టిసారించి నిత్యం ప్రజల్లో ఉండాలని ఉద్బోధించారు. దేశంలో మరే రాజకీయ పార్టీకిలేని పార్టీ బలం బీఆర్ఎస్కు ఉన్నదని, 60 లక్షల మంది పార్టీ శ్రేణులు అధికారంలో ఉన్నప్పుడు ఏ స్థాయిలో ప్రజాసేవలో మమేకం అయ్యామో అదే స్థాయిలో ఇప్పుడూ ఉండాలని దిశానిర్దేశం చేశారు.
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులతో త్వరలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించుకుందామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలతో చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోవటంతోపాటు పార్టీ కార్యాచరణకు సంబంధించిన అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో కేసీఆర్ వరుసగా నాలుగు రోజులుగా తనను కలిసేందుకు వస్తున్న ప్రజాప్రతినిధులతోపాటు ఓడిపోయిన అభ్యర్థులకు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు అనేక ఆటుపోట్లను ఎదుర్కొని మొక్కవోని దీక్షతో రాష్ట్రం కోసం తీవ్రమైన కృషి చేసిన సన్నివేశాలను ఈ సందర్భంగా ఆయన ఉదహరిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.