KCR | బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోదీ పదేళ్ల దేశంలో గద్దెకెక్కితే ఒక్క హామీ నెరవేర్చిండా ? బేటీ పడావో.. బేటీ బచావో ఎక్కడైనా కనిపించిందా? అమృత్ కాల్ వచ్చిందా ? అచ్చేదిన్ వచ్చిందా? అంటూ బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరావు ప్రశ్నించారు. కొత్తగూడెం రోడ్షోలో పాల్గొన్న కేసీఆర్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇవాళ ప్రపంచంలో మన రూపాయి వాల్యూ ఎంత? డాలర్కు రూ.83. నరేంద్ర మోదీ అంత దరిద్రమైన పాలన మళ్లీ మనం చూడం. అంత దుర్మార్గమైన పాలన. మతాలకు పంచాయితీ పెట్టి.. మన ఉద్వేగం రేపి ఓట్లు దొబ్బుకునేడే తప్ప ఏ మంచి పని జరుగలేదు. అమృత్ కాల్ అన్నడు వచ్చిందా? ఏదైనా మంచి పని జరిగిందా? అంటూ ప్రశ్నించారు.
‘ఇంకా మోదీ ఇవాళ ఏమంటున్నడు ? నేను గోదావరి నదిని ఎత్తుకుపోయి తమిళనాడు, కర్నాటకకు ఇస్తా అంటున్నడు. తెలంగాణకు ఉన్న ఒకే ఒక ఆధారం గోదావరి. మనకు ఉన్న ఒకే ఒక ఆధారం గోదావరి. ఆ గోదావరి నది కూడా పోతే మన బతుకులు ఏం కావాలి ? భద్రాచలం దగ్గర, దుమ్ముగూడెం సమీపంలో ఖమ్మం జిల్లాలోని ఎత్తయిన ప్రాంతాలు ఏనుకూరు, జూలూర్పాడ్ కావొచ్చు. కిందకున్న మండలాలు కావొచ్చు.. సాగర్లో నీళ్లు తక్కువ పడ్డప్పుడు.. అన్నింటికి ఆధారం సీతారామ ప్రాజెక్టు. ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నది. మీరే కళ్లారా చూస్తున్నరు. మీద ఇచ్చంపల్లి దగ్గర ఆనకట్ట కట్టి ఉన్న గోదావరి నీళ్లు తమిళనాడు, కర్ణాటకకు తరలించుకుపోతే మన తెలంగాణ గతి ఏం కావాలి? మీ గోదావరి నది మీ ముందే ఎత్తుకొని పోతా అని నరేంద్ర మోదీ చెబుతున్నడు’ అన్నారు.
‘ఆ నరేంద్రమోదీకి, బీజేపీకి మనం ఒక్క ఓటు కూడా వేయాలా? మనం ఎందుకు ఓటు వేయాలి? దయచేసి అందరూ ఆలోచన చేయాలి. ముఖ్యంగా విద్యావంతులు, యువకులకు ఒక్కటే మాట మనవి చేస్తున్న. ఇది ఆషామాషీ వ్యవహారం కాదు. మన బతుకుదెరువు సమస్య. మన జీవన్మరణ సమస్య. మొత్తం తెలంగాణకు గోదావరినే లేకుండా చేస్తానంటే.. ఈ నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడడం లేదు ? దాని వెనకలా ఉన్న మతలబు ఏంటీ ఆలోచన చేయాలి. ఈ విధంగా మన కండ్ల ముందే మనల్ని మోసం చేస్తా అంటున్నడు. నేను ముఖ్యమంత్రిగా ఉండే రోజుల్లో నరేంద్ర మోదీ ఒక కండీషన్ పెట్టిండు. కేసీఆర్ నువ్వు ఖచ్చితంగా రైతుల బావులకు మీటర్లు పెట్టాలంటాడు. నా తల తెగిపడ్డా మీటర్లు పెట్టా అని చెప్పిన. మరి ఇవాళ ఈ ఛోటేభాయ్.. బడే భాయ్.. కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేస్తే ఏమవుతుంది ? ఏం జరుగుతుంది? ఏ రకమైన పరిస్థితులు వస్తయ్’ అన్నారు.
‘ఖచ్చితంగా మోటార్లకు మీటర్లు పెడుతరు తస్మాత్ జాగ్రత్త అని మనవి చేస్తున్నా. తెలంగాణలో మీటర్లు పెట్టొద్దంటే.. తెలంగాణలో, తెలంగాణ కోసం పేగులు తెగేదాక కొట్లాడే బీఆర్ఎస్ ఎంపీలే గెలవాలి. నామా నాగేశ్వర్రావు, కవిత గెలవాలి. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్ అని పెట్టింది. ఫ్రీ బస్ పెడితే ఏమైంది? ఆటోరిక్షా వాళ్లు రోడ్డున పడ్డారు. ఇవాళ ఆటోవాళ్ల బతుకులు ఏమైనయ్? ఆటోల గతి ఏమైంది? ఇవాళ వాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. ఆటోరిక్షా కార్మికుల బతుకులు బాగుపడాలంటే.. ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులు ఎంపీలుగా గెలవాలి. వాళ్లకు న్యాయం జరగాలి. ఇవాళ గురుకులాలను పెట్టాం. ఆ గురుకులాల గతి ఏమవుతుంది? కలుషిత ఆహారం తిని అమ్మాయిలు బీమారి అయితున్నరు. భోనగిరిలో ఓ అమ్మాయి చచ్చిపోయింది. మీకు ఇంత పట్టింపులేదా? పేద విద్యార్థులంటే అలుసా? అన్నీ అబద్ధాలు చెబుతూ.. ప్రతి ఒక్క మాట కిందిమీద మాట్లాడున్నారు. ఖచ్చితంగా తెలంగాణ సమస్యలు, తెలంగాణ నదుల నీళ్లు తెలంగాణకే చెందాలంటే.. తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు రావాలంటే.. తెలంగాణ అస్థిత్వం.. ఆత్మగౌరవం నిలబడి ఉండాలంటే ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ వాళ్లు అయితే పోరాటం చేస్తరు’ అన్నారు.