KCR | నిజామాబాద్ : నేను కూడా హిందువునే.. నేను హిందువును కాదని కాదు.. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్ ప్రజల ఆత్మబంధువు కేసీఆర్ అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఏ ఒక్క వర్గానికో కాదు.. తెలంగాణలో ఉన్న ప్రజలందరూ బాగుపడాలి.. అన్ని వర్గాలు మంచిగా ఉండాలని కేసీఆర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రు చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే.. యువకులు ఆవేశంలో ఓటు వేయకుండా ప్రజాస్వామ్య పరిణితితో, విజ్ఞతతలో ఆలోచించి ఓటు వేయాలి. ఈ రాష్ట్ర భవిష్యత్ ఎవరి చేతిలో ఉంటే బాగుంటుందో అని కూలంకషంగా చర్చించి, ఓటు వేయాలి. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి. నేను కూడా హిందువునే. నేను హిందువును కాదని కాదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్ ప్రజల ఆత్మబంధువు కేసీఆర్. ఏ ఒక్క వర్గానికో కాదు.. తెలంగాణలో ఉన్న ప్రజలందరూ బాగుపడాలి. అన్ని వర్గాలు మంచిగా ఉండాలి. హిందూ – ముస్లిం భాయ్ భాయ్ ఉండాలి. అందరం కలిసి బతకాలి. దాంట్లోనే గొప్పతనం, దాంట్లోనే బలం ఉంటది. కానీ ప్రజలను విడదీసేలా మతవిద్వేషాలు రెచ్చగొడితే లాభం ఉండదు. మీ ఎంపీ నోరు తెరిస్తే ఎటువంటి మాటలు ఉంటాయో, గందరగోళం ఉంటదో తెలుసు. అన్ని విషయాల్లో మోదీని వ్యతిరేకించిన కాబట్టి నా బిడ్డ కవితను కూడా అరెస్టు చేసి జైల్లో పెట్టారు. నేను భయపడను. కాంప్రమైజ్ కాను. ఎట్టి పరిస్థితుల్లో పోరాటం చేస్తా తప్ప కేసీఆర్ ఏనాడు కూడా లొంగిపోలేదు. ఇప్పుడు కూడా లొంంగిపోయే ప్రసక్తే లేదు. ఆరు నూరైనా సరే లొంగిపోను అని కేసీఆర్ తేల్చిచెప్పారు.
మోదీకి మోజార్టీ వస్తలేదు. ఎన్డీఏ కూటమికి 250 కంటే మించి సీట్లు రావు. మనం 14 ఎంపీ స్థానాలు గెలిస్తే కేంద్ర రాజకీయాల్లో తెలంగాణ కీలకంగా మారుతుంది. బీజేపీ, కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు. ప్రాంతీయ శక్తులే ఏర్పాటు చేసే గవర్నమెంటే వస్తది. అప్పుడు మనది కీలక పాత్ర అయితది. ఈ రాష్ట్రంలో బీజేపీ వారిని ఓడించింది బీఆర్ఎస్సే. కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కైతాయి.. ఆ మోసం కూడా చేస్తరు. కాబట్టి ఇప్పుడు రైతులకు రైతుబంధు ఎలా వేస్తున్నారో.. అలానే అన్ని హామీలు అమలు కావాలంటే.. బీఆర్ఎస్ అయితేనే పేగులు తెగేదాకా కొట్లాడుతది. బాజిరెడ్డిని గెలిపించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా అని కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.