KCR | ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటితే.. కాళ్లు తంగెళ్లు దాటడం లేదని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సెటైర్లు వేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘అయ్యా ముఖ్యమంత్రి ఇదేం పనయ్యా బాబు. నువ్వు కొత్తగా ఏమీ ఇవ్వకున్నా. నడిచినదాన్నే నడిపించవచ్చు కదా? ఇప్పుడు ఇంకోటి చెబుతున్నరు. మేం ఐదెకరాలకే రైతుబంధు ఇస్తున్నం అంటున్నరు. ఆరెకరాలోడు ఏం పాపం చేసిండు.. పదెకరాలోడు ఏం పాపం చేసిండు. రైతులంటే అంత చులకననా? 20-30 ఎకరాలు ఇయ్యం అంటే అదొకమాట. కనీసం పది, పదిహేను ఎకరాలకైనా ఇవ్వాలి కదా? ఇయ్యల్నా వద్దా? వీళ్ల అయ్య సొత్తు ఏమన్నా పోతదా? వీళ్ల జాగీరు పోతదా? ప్రజల సొమ్మే కదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ప్రపంచంలో ఈ రోజు గవర్నమెంట్ సపోర్టు లేకుండా ఏ దేశంలో వ్యవసాయం జరుగతలేదు. అందుకే నా మెదడు కరగవెట్టి.. భారతదేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధు తీసుకువచ్చినం. టంచన్గా పడుతుంటే.. టింగు టింగుమని మీ సెల్ఫోన్లు మోగుతుండే. బ్రహ్మాండంగా మీరు పంటలు పండించారు. ధాన్యపు రాశులు వచ్చినయ్. మీరు నడి ఇంట్లో పడుకొని ఉంటే.. పొద్దుగాల పోతే పొలం పారి కనిపిస్తుండే. ఎందుకు ఈ నాలుగైదు నెలలకు ఇంత దుర్మార్గం ఎందుకు? తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్కు పంచాయితీ పడ్డది. ప్రజల తరఫున మాట్లాడేందుకు పంజు ఎవరు? కేసీఆర్ కొట్లాడాలా? యుద్ధం చేద్దామా?’ అని కేసీఆర్ ప్రశ్నించగా.. కొట్లాడుదాం.. యుద్ధం చేద్దామంటూ’ జనం నినదించారు. ‘మీ అందరికీ దండం పెట్టి ఒకటే మాట చెబుతున్నా. మీరు మద్దతు ఇవ్వండి. నా ప్రాణంపోయినా తెలంగాణ తెస్తా అని చెప్పి.. తెలంగాణ తెచ్చిన. మళ్లీ ఇవాళ నేను మిమ్మల్ని కోరుతున్నా. మీ తరఫున వాదించాలంటే.. దుర్మార్గపు కాంగ్రెస్ మెడలు వంచాలంటే నాకు మీ బలం ఇవ్వాలి’ అన్నారు.
‘ఇక్కడ చదువుకున్న మాజీ ఐపీఎస్ అధికారి మన ప్రవీణ్కుమార్ గెలవాలి. ప్రవీణ్ అల్లాటప్ప రాజకీయ నాయకుడు కాదు. మాజీ ఐపీఎస్ అధికారి. ఇప్పుడేం మాట అన్నడు. నాగర్ కర్నూల్ నియోజకవర్గాన్ని ప్రపంచంలో పెట్టే స్థాయికి తీసుకుపోయే బాధ్యత నాది అని ఆయన మాట్లాండిడు. ఆయన ఎవరో కాదు. అలంపూర్లో పుట్టిన బిడ్డ. సొంత గడ్డకు సేవ చేయాలని మీ ముందుకు వచ్చాడు. ఆయనకు మీ బలాన్ని ఇస్తే.. ప్రవీణ్కుమార్, నేను మిగతా బృందం అంతా కలిసి ఈ ముఖ్యమంత్రి మెడలు వంచి అన్ని హామీలు అమలు చేస్తామని మనవి చేస్తున్నా. ఆ చైతన్యం రావాలి. యువ సోదరులకు మనవి చేస్తున్నా. ఈ రాష్ట్రం, ఈ దేశం మీది.. బుద్ధితో ఆలోచన చేయాలి. ఓ ఒరవడిలో కొట్టుకుపోవద్దు. మీ భవిష్యత్తు, ఈ రాష్ట్రం ముఖ్యం. ఓట్లు, ఎన్నికలు, నాయకులు వస్తూ ఉంటున్నారు. పోతుంటారు. కానీ, మన బతుకులు నిజం. మన బతుకులు నిజంగా ఉండాలి’ అని పిలుపునిచ్చారు.