K Keshava rao | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అక్రమం అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు చెప్పారు. ఎమ్మెల్సీ కవిత, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ వంటివారిని కేవలం రాజకీయ కుట్ర కోణంలోనే అరెస్టు చేశారని అన్నారు. ఇక తాను కాంగ్రెస్లో చేరబోతున్నట్లుగా కే.కేశవరావు ప్రకటించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇటీవల తనను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కలిశారని, తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానించిందని కే.కేశవరావు తెలిపారు. 84 ఏళ్ల వయసులో తిరిగి సొంత ఇంటికి వెళ్లాలన్న ఆలోచన తనకు కూడా ఉన్నదని కేసీఆర్తో చెప్పినట్టు కేకే వెల్లడించారు. కేసీఆర్ తనకు చాలా గౌరవం ఇచ్చారని తెలిపారు. ఒక్క కేసీఆరే కాదు.. పార్టీ నేతలు, కార్యకర్తలు తనను బాగా చూసుకున్నారని అన్నారు. తనతో పాటు తన కుమార్తె విజయలక్ష్మీ కూడా కాంగ్రెస్లోకి వెళ్లాలన్న ఆలోచనతో ఉన్నట్లు వెల్లడించారు. తన కుమారుడు విప్లవ్ మాత్రం బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగాలని అభిప్రాయపడ్డారని తెలిపారు. కాగా, కేకే, విజయలక్ష్మి నిర్ణయంతో తనకు సంబంధం లేదని రాష్ట్ర టీయూఎఫ్ఐడీసీ మాజీ చైర్మన్ కే.విప్లవ్ కుమార్ తెలిపారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంపై తనకు నమ్మకం ఉందని అన్నారు.