KCR | నల్లగొండ : అటు గోదావరి, ఇటు కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన సంపూర్ణమైన వాటా వచ్చేదాకా బీఆర్ఎస్ కొట్లాడుతది అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చిచెప్పారు. ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేయంగనే కాదు.. అఖిలపక్షం తీసుకుని ఢిల్లీకి పోవాలి అని కేసీఆర్ డిమాండ్ చేశారు. చలో నల్లగొండ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మాకు అధికారం రావాలి.. ఎన్ని అబద్దాలు అయినా చెప్పుదాం అన్నట్టు నోటికొచ్చింది చెప్పిండ్రు. ఇవాళ కొత్తగా దుకాణం మొదలు పెట్టిండ్రు. వరికి, ఇతర పంటలకు కనీస మద్దతు ధర వస్తే వాళ్లు చెప్పిన 500 బోనస్ ధర ఇవ్వరంట.. మరి ఆనాడు ఎందుకు చెప్పిండ్రు. మద్దతు ధర రాలేదా..? కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వడ్లన్నీ కొనలేదా..? డబ్బులు బ్యాంకుల పడలేదా..? మరి ఇవాళ ఏమైంది. అదే ప్రభుత్వ వ్యవస్థ.. అదే కలెక్టర్లు కదా..? ఎక్కడికి పోయిండ్రు.. ఏం చేస్తుండ్రు.. మీ దొంగ మాటలతోని.. మీ నంగనాచి మాటలతోని, ఇతరుల మీద అభాండాలు వేసి తప్పించుకుంటాం అంటే నడవదు బిడ్డా జాగ్రత్త. మునుపు జరిగినట్టే జరగాలి. ఇంకా మంచిగా జరగాలి కానీ.. చెడ్డ జరిగితే జరగనివ్వం.. మిమ్మల్ని నిద్ర కూడా పోనివ్వం. అట్ల కొట్లాడుతాం తప్ప ఊరుకోం. అటు గోదావరి, ఇటు కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన సంపూర్ణమైన వాటా వచ్చేదాకా బీఆర్ఎస్ కొట్లాడుతది. ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేయంగనే కాదు.. అఖిలపక్షం తీసుకొని పోవాలి ముఖ్యమంత్రి. అధికార పార్టీతో పాటు అన్ని రాజకీయ పార్టీల నాయకులను ఢిల్లీకి తీసుకొని పోవాలి. ప్రధానమంత్రిని నిలదీయాలి.. మా వాటా మాకు వస్తే తప్ప ఊరుకోం అని చెప్పాలి. అది చెప్పేదాకా మనం కూడా వెంబడపడాలి. ప్రజా ఉద్యమాలు ఉంటేనే ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటాయి. జాగ్రత్తగా ఉంటాయి. కాబట్టి ఈ దొంగ నాటకాలు మానుకొని పాలమూరు ప్రాజెక్టు ఎట్ల పూర్తి చేయాల్నో ఆలోచించండి. మంచి కరెంట్ ఎట్ల ఇవ్వాల్నో ఆలోచించండి అని కేసీఆర్ సూచించారు.