KCR | సంగారెడ్డి : తెలంగాణకు బీజేపీ అక్కరకు రాని చుట్టం అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. బీజేపీకి ఓటు వేస్తే మంజీరా నదిలో పడేసినట్టే అని తెలిపారు. సుల్తాన్పూర్లో ఏర్పాటు చేసిన జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
బీజేపీ ఈ పదేండ్లలో తెలంగాణకు ఒక్క పని కూడా చేయలేదంటూ కేసీఆర్ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా సుమతీ శతకాన్ని కేసీఆర్ ప్రస్తావించారు.
అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదా
నెక్కినఁ బారని గుర్రము
గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ! అని కేసీఆర్ అన్నారు.
బీజేపీ అక్కరకురాని చుట్టం. ఒక్క మెడికల్ కాలేజీ, నవోదయ కాలేజీ ఇవ్వలేదు. ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదు. బీజేపీకి ఓటేస్తే మంజీరా నదిలో పడేసినట్టే. అది ఎందుకు పనికిరాదు. యువకులు పిచ్చిపిచ్చిగా గుడ్డిగా ఓట్లు వేయకుండా ఆలోచించాలి. తెలంగాణకు న్యాయం జరగలాంటే, హక్కులు కాపాడాలంటే, ప్రాజెక్టులు పూర్తి కావాలంటే, రైతాంగానికి మళ్లీ మేలు జరగాలంటే ఈ ఆగమాగం పార్టీలతో కాదు.. తెలంగాణ హక్కుల కోసం పేగులదాకా కొట్లాడే పార్టీ కేవలం గులాబీ జెండా బీఆర్ఎస్ పార్టీనే. గులాబీ జెండాను ఆదరించాలి. మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి వినోద్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించండి. ఆగమాగమైతే అడవైపోతాం. మీ ఆశీర్వచనంతోనే ఈ రాష్ట్రంలో మళ్లా బీఆర్ఎస్ గవర్నమెంట్ గ్యారెంటీగా తెస్తా. అన్ని వర్గాలను, రైతులను కాపాడుకుంటాను. దళిత బిడ్డలకు దళిత బంధు ఇచ్చి తీరుతా. మీ ఆశీర్వచనంతో ముందుకు సాగుతా అని పేర్కొంటూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.