KCR | హైదరాబాద్ : తెలంగాణలో రోజురోజుకూ కాంగ్రెస్ పాలన దిగజారిపోతోంది.. వంద రోజులు పూర్తికాక ముందే వ్యతిరేకత వస్తోంది అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలతో సమావేశమైన సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ భేటీలోనే మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి పేరును కేసీఆర్ ప్రకటించారు. ముఖ్యులతో చర్చించి నాగర్కర్నూల్ అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కష్టకాలంలో పార్టీ నుంచి వెళ్తున్న వారిని మళ్లీ చేర్చుకోవద్దని పలువురు నాయకులు కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. పార్టీని వీడుతున్న వారిని మళ్లీ తీసుకునే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు అలవిగాని హామీలిచ్చి ఆశలు రేకెత్తించారు. హామీల అమలుపై నాలుక మడతపెట్టి తిట్లకు దిగుతున్నారు. ప్రభుత్వంలో ఉన్నవారు డబ్బులు లేవని చెప్పడం సరికాదు. పాలమూరుకు ఎంతో చేశాం.. అక్కడి ఓడిపోవాల్సింది కాదు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల కాల్వలు పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలి. నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల అనాలోచిత చర్య. దుష్ప్రచారాలు నమ్మి ఓట్లేసిన వారికి వాస్తవాలు తెలుస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నాం. నాగర్కర్నూల్ ఎంపీ రాములుకు ఏం తక్కువ చేశాం..? ఎంపీ రాములుతో పాటు ఆయన కుమారుడికి అవకాశాలు ఇచ్చాం. అవకాశవాదులు వస్తుంటారు.. పోతుంటారు. ప్రజల్లో ఉండాలి కానీ.. గెలుపు ఓటములు ముఖ్యం కాదు అని కేసీఆర్ పేర్కొన్నారు.