హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవం శనివారం పండుగలా జరిగింది. పార్టీ నాయకులు, కార్యకర్తల సంబురాల మధ్య వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. తెలంగాణ భవన్, పరిసర ప్రాంతాలు గులాబీమయం అయ్యాయి. శుక్రవారం ఉదయం నుంచే వివిధ జిల్లాల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలు, నాయకులతో తెలంగాణభవన్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. కార్యకర్తల సందడితో కోలాహలంగా మారాయి. బీఆర్ఎస్ ఏర్పాటు కీలక ఘట్టంలో తాము భాగస్వామ్యం కావాలని, ఆ ఘట్టాన్ని కండ్లారా చూడాలని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జై తెలంగాణ, జై భారత్, పీఎం కేసీఆర్, కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్దపెట్టున నినదించారు.
బీఆర్ఎస్ ఏర్పాటు సూచికగా సీఎం కేసీఆర్ పార్టీ జెండా ఆవిష్కరించిన సందర్భంలో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో భావోద్వేగం స్పష్టంగా కనిపించింది. నినాదాలతో భవన్ ప్రాంగణం హోరెత్తింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చారు. బంజారా నృత్యాలు, డప్పు చప్పుళ్లు, డ్యాన్సులతో తెలంగాణ భవన్ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది. జాతీయ పార్టీ ఆవిర్భావంలో తాము కూడా భాగస్వామ్యం అయ్యామనే సంతృప్తి, సంతోషం, ఉత్సాహం అక్కడున్నవారిలో తొణికిసలాడింది. బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్లో ఫొటోలు దిగేందుకు అందరూ పోటీపడ్డారు.