ఇస్లామాబాద్, జూలై 15: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) సమస్య రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. వివిధ డిమాండ్ల సాధనకు గత 40 రోజులుగా ఆందోళనలతో అట్టుడుకుతున్నా.. పదుల సంఖ్యలో నిరసనకారులు మృతి చెందినా.. అటు ప్రభుత్వం కానీ, ఇటు ఆందోళనకారులు కానీ దిగి రావడం లేదు. తమ 38 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచామని, వాటిని తప్పక నెరవేర్చాల్సిందేనని, అప్పటివరకు ఆందోళనను విరమించేది లేదంటూ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) స్పష్టం చేసింది.
ఇస్లామాబాద్ పాలనను తాము అంగీకరించమని, తమ హక్కులను గౌరవించకపోతే వేరే మార్గాలను చూసుకోవాల్సి వస్తుందని కూడా ఆందోళనకారులు ఇప్పటికే హెచ్చరించారు. సుమారు నెలన్నర నుంచి జరుగుతున్న ఆందోళనల కారణంగా మార్కెట్లు మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించాయి. వేలాది మంది ఆందోళనకారులు డిమాండ్ల సాధనకు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.
ఆందోళనకారుల 38 డిమాండ్ల పట్టికలో పలు అంశాలు ఉన్నప్పటికీ ప్రధానంగా విద్యుచ్ఛక్తి వారి ప్రధాన డిమాండ్గా ఉంది. పీవోకోలో తయారవుతున్న జల విద్యుత్ను తయారీ ధరకే స్థానికులకు అందజేయాలని వారు కోరుతున్నారు. మంగ్లా డ్యామ్ లాంటి ప్రాజెక్టుల నుంచి వచ్చే రాయితీలను నేరుగా ఆ ప్రాంతానికి బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అదనపు పన్నులు, ఇంధన సర్దుబాటు చార్జీలు, విద్యుత్ బిల్లుల్లోని సర్చార్జీలు తొలగించాలని, విద్యుత్ కోతలను ఆపాలన్నది వారి డిమాండ్లు. అలాగే గోధుమ పిండి ధరలను గిల్గిట్ బాల్టిస్థాన్తో సమానం చేయడం, చక్కెర, వంటనూనె, ఇతర నిత్యావసరాలను తక్కువ ధరకు ఇవ్వాలని, రైతులకు ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పీవోకే అసెంబ్లీలో రిజర్వ్ చేసిన 12 స్థానాలను రద్దు చేయాలని, ఆందోళనకారులపై ఉగ్రవాద కేసులను రద్దు చేయాలన్నది జేఏఏసీ డిమాండ్లు. వీటిపై ఇప్పటికే పాకిస్థాన్ ప్రభుత్వం.. ఆందోళనకారులతో చర్చలు జరిపింది. అయితే ఏ అంశంపై కూడా ఇంతవరకు ఎలాంటి ఒప్పందం జరుగలేదు.
‘పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ స్వతంత్ర ప్రాంతం కాదు.. వివాదాస్పద ప్రాంతం కూడా కాదు, ఇది ఆక్రమణకు గురైన భాభాగం’ అని పీవోకే నిరసన ఉద్యమ నేత సర్దార్ అమన్ ఖాన్ పేర్కొన్నారు. రావల్కోట్లోని ఈద్గా గ్రౌండ్లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘ఇది వివాదాస్పద ప్రాంతం కాదు.. ఇది ఆక్రమిత ప్రాంతం’ అని సభికుల హర్షధ్వానాల మధ్య ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్ ఇప్పటికే ఈ ప్రాంతానికి ఆహారం, ఔషధాల సరఫరాను గత మూడు వారాలుగా నిలిపివేసిందని ఆరోపించారు. ఈ సందర్భంగా తమకు మానవతా సహాయం అందించాలని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న వారితో పాటు భారత దేశానికి విజ్ఞప్తి చేశారు.