సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో బదిలీల వ్యవహారం తీవ్ర గందరగోళంగా మారింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్న శాఖలోనే నిబంధనలు తుంగలో తొకడం, బదిలీ ఉత్తర్వులు వెలువడి నెలన్నర గడిచినా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం జారీచేసిన జీవోలను ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగానే పకన పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
చివరకు సస్పెన్షన్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ)కి సైతం పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం బదిలీ ఉత్తర్వులు జారీ చేయడం ఈ విభాగం పనితీరుకు అద్దం పడుతోంది. జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న సదరు ఈఈని కమిషనర్ కర్ణన్ సస్పెండ్ చేయగా, ఆ సస్పెన్షన్ తొలగకముందే పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అధికారులు ఆయనను ఎంఎంసీకి బదిలీ చేయడం తీవ్ర వివాదస్పదంగా మారింది. ఇంత జరుగుతున్నా మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
జీవో 575 అమలులో తీవ్ర నిర్లక్ష్యం..
పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగంలో ఈఈ స్థాయి అధికారుల బదిలీల కోసం ప్రభుత్వం జారీచేసిన జీవో 575 అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), డిప్యూటీ ఈఈల బదిలీ ఆదేశాలు వెలువడి ఐదు వారాలకు పైగా గడుస్తున్నప్పటికీ, చాలామంది ఇంజినీర్లకు ఇప్పటివరకు తుది పోస్టింగులు కేటాయించలేదు. దీంతో బదిలీ అయిన అధికారులు విధుల్లో చేరలేక తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. కొన్ని కార్పొరేషన్ల పరిధిలో పాత స్థానాల నుంచి రిలీవ్ అయిన అధికారులను, కొత్త కార్పొరేషన్లలో జాయిన్ చేసుకోకపోవడం వంటి విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి..
జీవో 38 ఉల్లంఘనలు.. పాత స్థానాలకే పాకులాట!
సుదీర్ఘకాలం ఒకేచోట పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలనే ఉద్దేశంతో తెచ్చిన జీవో 38 నిబంధనలను ఇకడ పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు అధికారులు 10 నుంచి 12 ఏళ్లుగా ఒకే ప్రాంతంలో తిష్టవేసి కొనసాగుతున్నా రాజకీయ, ఇతర సిఫార్సులతో తిరిగి అదే స్థానాల్లో ఉంచేందుకు తెరవెనుక పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగా సీఎంసీ పరిధి కూకట్పల్లి జోన్లో ఈఈ ఓ ఎమ్మెల్యే సిఫారసుతో అదే స్థానంలో కొనసాగుతున్న తీరు చర్చనీయాంశంగా మారింది.
ఇదే కార్పొరేషన్ పరిధిలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓ ఈఈ ఇక్కడ పోస్టింగ్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. మొత్తంగా ప్రభుత్వం బదిలీ చేసిన కొంతమంది అధికారులను తమ పరిధిలోనే (జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ) ఉంచాలంటూ సదరు కమిషనర్లు ఇంజినీరింగ్ హెచ్ఓడీకి లేఖలు రాయడం గమనార్హం. ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయడానికి కమిషనర్లు విముఖత చూపుతున్నారనడానికి ఈ లేఖలే నిదర్శనమని ఉద్యోగులు వాపోతున్నారు. ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి బదిలీపై వచ్చి రిపోర్ట్ చేసిన వారిని సైతం చేర్చుకోవడానికి కొందరు కమిషనర్లు ససేమిరా అంటున్నట్లు సమాచారం.
పోస్టింగులు లేవు.. జీతాలకూ తిప్పలే!
ట్రై కార్పొరేషన్ల పరిధిలో నెలకొన్న ఈ గందరగోళం వల్ల ఇంజినీర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జీహెచ్ఎంసీ, సీఎంసీలలో చేరిన కొందరు ఇంజినీర్లు నెల రోజులుగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఎంఎంసీలో ఇంజినీరింగ్ అధికారుల కొరత కారణంగా అభివృద్ధి, ప్రాజెక్టు పనులపై తీవ్ర ప్రభావం పడుతోంది. పోస్టింగ్ లేకుండా వేచి చూస్తున్న అధికారులకు ఈనెల జీతాల చెల్లింపు కూడా పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పారదర్శకత ఎకడ..?
ఈ మొత్తం వ్యవహారంపై ఇంజినీరింగ్ వర్గాలు తీవ్ర అసంతృప్తి, నిరసనను వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల అమలులో పారదర్శకత పాటించాలని, బదిలీల ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి, అవకతవకలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీవో 38, జీవో 575ల అమలుపై ఇకనైనా ఉన్నతాధికారులు స్పందిస్తారా? పోస్టింగ్ కోసం నిరీక్షిస్తున్న ఇంజనీర్ల సమస్యలను ఎప్పుడు పరిషరిస్తారనేది ట్రై కార్పొరేషన్లలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.