జనగామ, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): గొల్ల కురుమలకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత వారికి రాజకీయ ప్రాధాన్యత లభించిందని బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం జనగామలో కొమురవెల్లి ఆలయ మాజీ చైర్మన్, కుర్మ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సేవెల్లి సంపత్ అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ కురుమల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే రాజయ్య, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం పాల్గొన్నారు. కారుగుర్తుకు ఓటేసి పల్లాను గెలిపించుకుంటామని కురుమలు ప్రకటించి ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు.
ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. కురుమలకు కొమురవెల్లి ఆలయ చైర్మన్ పదవి సహా కార్పొరేషన్ పదవులు, చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించే స్థానాల అంశాన్ని అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి తప్పకుండా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కోకాపేటలో కురుమ భవనానికి రూ.500 కోట్ల విలువైన 500 గజాల భూమి ఇచ్చి భవన నిర్మాణం భారీగా నిధులు కేటాయించిన విషయాన్ని ఆయన వివరించారు. కురుమలను అభివృద్ధి చేసే బాధ్యత తనదని, కేసీఆర్ను ఆశీర్వదించడంతోపాటు తనను భారీ మెజారిటీతో దీవించాలని పల్లా రాజేశ్వర్రెడ్డి కోరారు. సమ్మేళనంలో సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ క్యామ మల్లేశం, మార్కెట్ చైర్మన్ బాల్దె సిద్ధిలింగం, మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.