Maharashtra Laborers | ఆదిలాబాద్, నవంబర్ 19(నమస్తే తెలంగాణ): బోథ్ నియోజకర్గం బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్జాదవ్ ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో పత్తిచేలో పనిచేస్తున్న మహారాష్ట్ర కూలీలను కలిశారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర కూలీలు అనిల్ జాదవ్తో తమ గోడు వెల్లబోసుకున్నారు. ‘తెలంగాణలో సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయి.
మా మహారాష్ట్రలో ఉపాధి లేక సరిహద్దులో ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి కూలి పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నం. మా రాష్ట్రంలో కూలి పనులు దొరకక పస్తులు ఉండాల్సిన దుస్థితి ఉంది. మా దగ్గర రైతుబంధు లేదు.. కరెంటు ఉండదు.. పింఛన్ ఇయ్యరు.. ఆడపిల్లల పెండ్లిళ్లకు పైసలు రావు.. తాగడానికి నీళ్లు సరిగా సరఫరా చేయరు.. పాణం మంచిగ లేకపోతే చూసేటోళ్లు ఉండరు. చేసేది లేక ఆదిలాబాద్ రిమ్స్ దవాఖానకు వస్తున్నాం. సర్కారు పథకాల కోసం ఎన్ని దరఖాస్తులు పెట్టినా ఫలితం లేదు. ప్రజాప్రతినిధులు ఎన్నికలప్పుడు మాత్రమే వస్తరు. సమస్యల గురించి పట్టించుకోరు.
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అన్ని రకాల సాయం అందిస్తుండటంతో పంటలు బాగా పండుతున్నాయి. దీంతో మేము ఏటా పత్తి సీజన్లో ఉపాధి కోసం ఆదిలాబాద్ జిల్లాకు వస్తం. మూడు నెలలపాటు కూలి పనులు చేసుకొని ఉపాధి పొందుతాం. యాసంగిలో పల్లిలు తీయడానికి వచ్చి నెల రోజులు ఇక్కడే పనులు చేస్తాం. కుటుంబసభ్యులతో కలిసి వచ్చి ఇక్కడ ఉంటాం. రైతులు నివాస సౌకర్యం కల్పిస్తారు. మా దగ్గర వ్యవసాయ పనులకు వెళ్తే రోజుకు రూ.200 మాత్రమే కూలి ఇస్తారు. తెలంగాణలో అయితే.. రోజుకు రూ.400 నుంచి రూ.500 కూలి దొరుకుతది.
భార్యాభర్తలం పనిచేస్తే రూ.800 నుంచి రూ.1000 వరకు గిట్టుబాటు అవుతది. మూడు నెలల్లో ఇద్దరం కలిసి రూ.50 వేల వరకు సంపాదిస్తాం. మేము తెలంగాణలో ఉంటే స్థానికుల లాగా సంతోషంగా జీవించేవాళ్లం. మా కష్టాలు దూరం కావాలంటే తెలంగాణలో ఉంటేనే సాధ్యమవుతది. మాకు ఆదిలాబాద్ జిల్లాలో నివసించే అవకాశం కల్పించాలి’ అని మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా మాండ్వీకి చెందిన కూలీలు కోరుతున్నారు.