KTR | హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): రైతులకు ఉచిత విద్యుత్తు విషయంలో కాంగ్రెస్ పార్టీ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకొన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. రాష్ట్రంలోని 95 శాతం మంది రైతన్నలకు మూడు గంటల విద్యుత్తు సరఫరా చాలని, ఉచిత విద్యుత్తు అవసరం లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితోపాటు కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ఎండగట్టాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. శనివారం పార్టీ శ్రేణులతో మంత్రి కేటీఆర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తే ఉచిత విద్యుత్తును రద్దు చేస్తుందన్న సత్యాన్ని ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్లాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ ఇస్తున్న మూడు పంటలు కావాలా ? కాంగ్రెస్ పార్టీ మూడు గంటల కరెంటు కావాలా ? అన్న నినాదంతో కదంతొకాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ నేతల ప్రకటనలపై ప్రతి గ్రామంలో, ప్రతి రైతు ఇంట్లో చర్చ జరగాల్సిన అవసరం ఉన్నదని అన్నారు.
ఈ నెల 17వ తేదీ నుంచి 10 రోజులపాటు రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల వద్ద రైతులతో సమావేశాలు నిర్వహించి, కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తే ఉచిత విద్యుత్తు రద్దవుతుందన్న విషయాన్ని తెలియజెప్పాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి రైతు వేదిక వద్ద కనీసం వెయ్యి మంది రైతులకు తగ్గకుండా సమావేశం నిర్వహించాలని సూచించారు. సమావేశ నిర్వహణ బాధ్యతను పార్టీ ఎమ్మెల్యేలు తీసుకోవాలని ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్తుపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేయాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేయాలని, కాంగ్రెస్ పాలనలోని కరెంటు కష్టాలను.. బీఆర్ఎస్ పాలనలోని కరెంటు వెలుగులను రైతులకు వివరించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ కటిక చీకటి కావాలా? రైతు జీవితాల్లో కరెంటు వెలుగులు నింపిన బీఆర్ఎస్ కావాలా? తెలుసుకోవాలని రైతులను కోరాలని సూచించారు.
రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతన్నల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం ఎంతో కష్టపడుతుంటే, రైతుల పట్ల, వ్యవసాయ రంగం పట్ల గుడ్డి వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్తును అనుచితమని మాట్లాడిందని కేటీఆర్ మండిపడ్డారు. 2001లో వ్యవసాయం దండుగ అన్న చంద్రబాబు ఆలోచనలను, ఆయన శిష్యుడైన రేవంత్రెడ్డి అనుసరిస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ తెలుగు కాంగ్రెస్, చంద్రబాబు కాంగ్రెస్ అన్న విషయాన్ని ప్రజలకు తెలియచెప్పాలని సూచించారు. కాంగ్రెస్ విధానాలు తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు అని మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. అందుకే రైతులు పెద్ద ఎత్తున కాంగ్రెస్కు వ్యతిరేఖంగా స్పందించారని తెలిపారు.
హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావుకు మరో ప్రతిష్ఠాత్మక సదస్సుకు ఆహ్వానం అందింది. వచ్చే సెప్టెంబర్ 14న జర్మనీలోని బెర్లిన్ నగరంలో నిర్వహించే ‘గ్లోబల్ ట్రేడ్ అండ్ ఇన్నోవేషన్ పాలసీ అలయెన్స్’ (జీటీఐపీఏ) వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనాలని కోరుతూ శాస్త్ర సాంకేతిక రంగ విధానం కోసం పనిచేస్తున్న ప్రపంచ నిపుణులతో కూడిన ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఫౌండేషన్’ (ఐటీఐఎఫ్) ఆహ్వానించింది. అధునాతన సాంకేతిక రంగాలకు సంబంధించి స్వదేశీ, విదేశీ పెట్టుబడుల సాధనలో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలు, సామాజిక, ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడంలో డిజిటల్ టెక్నాలజీ విస్తరణపై ప్రజెంటేషన్ ఇవ్వాలని కేటీఆర్కు రాసిన లేఖలో ఐటీఐఎఫ్ ఉపాధ్యక్షుడు స్టీఫెన్ ఎజెల్ కోరారు.
జీటీఐపీఏ వాణిజ్యం, ప్రపంచీకరణ, ఆవిష్కరణల ద్వారా పౌరులకు ప్రయోజనాలు అందించేందుకు కృషిచేస్తున్న స్వతంత్ర నిపుణులతో కూడిన సంస్థ. అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న ఆర్థిక, వాణిజ్య, ఆవిష్కరణ సవాళ్లకు సృజనాత్మక పరిష్కారాలను కనుగొనడమే ఈ సదస్సు లక్ష్యం. ప్రాంతీయ ఆవిష్కరణల్లో పోటీతత్వం, జీవశాస్ర్తాల ఆవిష్కరణలను వేగవంతం చేసేందుకు ఉద్దేశించిన విధానాలు, డీకార్బనైజేషన్ను సులభతరం చేసే డిజిటల్ సాంకేతికతలు, ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో సుస్థిరత సాధించడం వంటి అంశాలపై ఈ సందర్భంగా కీలక చర్చలు జరగనున్నాయి. ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచలోని శాస్త్ర, సాంకేతిక రంగాలకు చెందిన నిపుణులు చర్చల్లో పాల్గొంటారు. వాణిజ్యం, ప్రపంచీకరణ, ఆవిష్కరణ విధాన సమస్యలపై చర్చించేందుకు ప్రపంచంలోని ప్రముఖ విషయ నిపుణులు, వ్యాపార, ప్రభుత్వ, విద్య, విధాన రూపకల్పనకు సంబంధించిన ప్రపంచ ప్రముఖులను ఈ సదస్సుకు ఆహ్వానించారు.
పదేండ్ల కింద సర్కారు కరెంటే సక్కగియ్యలే. వరేసి కరెంటు మోటరు పెట్టేందుకు నాయనతో కలిసి పొలం కాడనే పడుకునేది. తాపకోసారి లేసి కరెంటు వచ్చిందా అని సూసుకునేది. నేను నిద్రపోతే మానాయన తెలివితోటి ఉండి కరెంటు రాంగనే మోటారు చాల్ జేత్తుండే. వచ్చిన కరెంటుతో మడులే మునగలేదు. రాత్రి, పొద్దుగాల పొలం కాడనే ఎల్లదీసినం. లోవోల్టేజీ వచ్చి మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు ఎప్పుడు ఖాళీ పోతుండే. వడ్లమ్మిన పైసలన్నీ కరెంటు మోటర్ల రిపేర్లకే పెట్టుడైంది. ఆ రోజులు మళ్ల రావద్దని దేవుడిని మొక్కుతున్నం. కేసీఆర్ సార్ వచ్చినంక కరెంటు పుల్గా ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్లు అప్పుడు తక్కువుండే. ఇపుడు మస్తుగా పెట్టిండ్రు. లోవోల్టేజీ అన్నదే లేదు. కేటీఆర్ సార్ సల్లంగుండ మూడూళ్లకో సబ్ష్టేషన్ పెట్టించి కరెంటు గోస తీర్చిండు. కేసీఆర్ సార్ జెయ్యవట్టి రైతులకు న్యాయం జరుగుతుంది.
– బల్యాల గోపాల్, బల్యాల నగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా