హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ-స్పెషల్ టాస్క్ బ్యూరో) ): ఎనిమిదేండ్లుగా ఆడిందే ఆటగా చెలరేగుతున్న బీజేపీకి చెక్ పెట్టగల ప్రత్యామ్నాయం ఎట్టకేలకు పుట్టుకొచ్చింది. ఇంతకాలం ఏకపార్టీ విధానంగా మారిపోయిన రాజకీయాలను భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) బద్దలు కొట్టగలదని ప్రజలు భావిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ రాజకీయాలను పశువుల సంతగా మార్చిన బీజేపీని బలంగా ఢీకొట్ట్టే సత్తా ఒక్క బీఆర్ఎస్కు మాత్రమే ఉన్నదని నమ్ముతున్నారు. బీజేపీని ఎదుర్కొవడంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమై కాడి దించేసిన దశలో ఆ రాజకీయ శూన్యాన్ని బీఆర్ఎస్ విజయవంతంగా భర్తీ చేయగలదని రాజకీయ విశ్లేషకులు స్పష్టంచేస్తున్నారు. కేసీఆర్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులను బీఆర్ఎస్ ఏకం చేస్తుండటం వారి నమ్మకాన్ని మరింత పెంచుతున్నది. ఖమ్మంలో బుధవారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ సభకు వామపక్ష పార్టీల జాతీయ నాయకత్వంతో పాటు ఉత్తర, దక్షిణాదికి చెందిన ప్రాంతీయ పార్టీల అధినేతలు, ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు.
కేంద్రంలో బీజేపీని ఎదుర్కోగల సత్తా నిన్నమొన్నటివరకు ఏ పార్టీకి లేకపోయింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడటంతో బీజేపీకి ఎదురులేకుండా పోయిం ది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను, రాజకీయ డొల్లతనాన్ని, ప్రజాస్వామ్య పరిహాస విధానాలను, లోపభూయిష్ట ఆర్థిక విధానాలను ఎండగడుతూ సీఎం కేసీఆర్, దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. బీజేపీ ముక్త్ భారత్ నినాదంతో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు పూర్వరంగాన్ని సిద్ధం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ పన్నిన కుట్రను ముందే పసిగట్టిన కేసీఆర్, బీజేపీ నిజస్వరూపాన్ని దేశప్రజల ముందు ఉం చారు. ఈ ఘటనతోనే కేసీఆర్ నాయకత్వం, బీజేపీని ఎదుర్కొగల శక్తియుక్తులు, రాజకీయ చాణక్యం, వ్యూహంపై గురి ఏర్పడింది.