చెన్నూర్, మార్చి 14: అవినీతికి పేటెంట్ కాంగ్రెస్ పార్టీ అయితే బ్లాక్ మెయిల్కు పేటెంట్ రేవంత్రెడ్డి అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దొంగల ముఠాకు అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్రెడ్డి కూడా అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగానే ఉన్నదని ధ్వజమెత్తారు. హైదరాబాద్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం, అమరవీరుల స్మారక స్థూపం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మించడం ఆ రెండు జాతీయ పార్టీలకు మింగుడు పడటం లేదని అన్నారు. 2004 ఎన్నికల్లో తమతో పెత్తు పెట్టుకొని కరీంనగర్లో సోనియాగాంధీ తెలంగాణపై మాట ఇచ్చి, తర్వాత మాట మార్చిన విషయం రేవంత్రెడ్డి గుర్తు పెట్టుకోవాలని పేర్కొన్నారు.
తెలంగాణ మలి దశ ఉద్యమంలో వెయ్యి మంది అమరులవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కారణం కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రైతుబంధు, రైతుబీమా లాంటి ఏ ఒక్క పథకం అమలుచేయడం లేదని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీకి బీఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్ము లేక నాయకులను టార్గెట్ చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ తాటాకు చప్పుళ్లకు, బీజేపీ బెదిరింపులకు, కేసులకు భయపడేది లేదని స్పష్టంచేశారు. ఉద్యమ సమయంలో వందల కేసులు ఎదుర్కొని తెలంగాణను సాధించుకున్న చరిత్ర బీఆర్ఎస్ నాయకులదని తెలిపారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నదని విమర్శించారు. అదానీ.. ప్రధాని బినామీ ఆని ఆరోపించారు. కేసీఆర్ను ఎదుర్కొనే దమ్ములేక కవితపై ఈడీ దాడులు చేయిస్తున్నారని పేర్కొన్నారు. దమ్ముంటే తమతో అభివృద్ధిలో పోటీపడాలని సవాల్ విసిరారు. బీజేపీ నాయకులకు కూల్చుడు, పేల్చుడు తప్ప ఇంకేం తెలియదని ఎద్దేవా చేశారు. రాష్ర్టానికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని స్పష్టంచేశారు.