KTR-Auto Drivers | హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఎదురొంటున్న ఇబ్బందులపై విస్తృతంగా అధ్యయనం చేయడానికి పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఒక కమిటీని వేస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు పలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ తమ స్థితిగతులపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పార్టీ అధినేత కేసిఆర్ ఆదేశాల మేరకు వారి సమస్యలను వారు, కోరుకుంటున్న పరిషార మార్గాలను తెలుసుకునేందుకు ఈ కమిటీని వేస్తున్నట్లు శుక్రవారం కేటీఆర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కమిటీలో భాగంగా కార్మిక విభాగం నాయకులు రూప్సింగ్, రాంబాబు యాదవ్, మారయ్య ఆటో డ్రైవర్ల ప్రతినిధులతో మాట్లాడుతారని కేటీఆర్ పేర్కొన్నారు. కేవలం ఆటో డ్రైవర్లే కాకుండా రాష్ట్రంలో ఉన్న ఓలా, ఉబెర్, ఇతర టాక్సీ డ్రైవర్లతో కూడా వీరు చర్చించి ఒక నివేదికను పార్టీకి అందజేయాలని చెప్పారు. కార్మిక విభాగం నాయకులు అందించే నివేదిక ఆధారంగా ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలను ఇస్తామన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిషారం కోసం పార్టీ తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.