హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు జరిగిన అవమానంపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. భగవంతుడి సాక్షిగా ముఖ్యమంత్రి సమక్షంలోనే జరిగిన అవమానానికి రేవంత్రెడ్డి క్షమాపణలు చెప్పాలంటూ దళితులు నిరసనకు దిగారు. రెడ్లు పైన కూర్చుంటే దళితులు, బీసీలు సీఎం కాళ్ల వద్ద కూర్చోవాలా? అంటూ మండిపడుతున్నారు. బీఆర్ఎస్ సహా పలువురు రాజకీయ నాయకులు సీఎం వ్యవహారాన్ని తూర్పారబట్టారు. భట్టికి, కొండా సురేఖకు వెంటనే క్షమాపణలు చెప్పాలని ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు, దళిత, బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ దళిత ద్వేషి అని మరోమారు తేలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కవాడిగూడ: డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కను అవమానించిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాదిగ రాజ్యాధికార పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు తిమ్మన నవీన్ రాజు డిమాండ్ చేశారు. సోమవారం రాత్రి లోయర్ ట్యాంక్బండ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద భట్టికి జరిగిన అవమానాన్ని నిరసిస్తూ మాదిగ రాజ్యాధికార పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కుమార్, ప్రవీణ్, జైరాంరాజు, అరుణ్ కుమార్, జీ మహేశ్, ఎస్ మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం భట్టిని అవమానించిన సీఎం రేవంత్రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎన్ బాలపీరు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. యాదగిరిగుట్టలో సోమవారం జరిగిన పూజా కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను అవమానించిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఉత్తమ, వెంకట్రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం గన్పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద భట్టికి జరిగిన అవమానాన్ని నిరసిస్తూ రెండు గంటల పాటు ధర్నా చేపట్టారు. భట్టికి మాత్రమే అవమానం జరగలేదని మొత్తం దళితజాతికే అవమానం జరిగిందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తంచేశారు.
యాదగిరిగుట్ట ఆలయంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ సహా అగ్రవర్ణ మంత్రులు కుర్చీలపై కూర్చుంటే దళిత, బహుజన వర్గాలకు చెందిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కొండా సురేఖ చెరోపక్క కిందకూర్చోవడం బాధ కలిగించిందని బీఆర్ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ అన్నారు. రాజ్యంగ పదవుల్లో ఉన్నవాళ్లు ఫ్యూడల్ మనస్తత్వాన్ని ప్రతిబింబించేలా వ్యవహరించకూడదని పేర్కొన్నారు. ఇది కేవలం భట్టి విక్రమార్కకో, కొండా సురేఖకో జరిగిన అవమానం కాదని, అణగారిన వర్గాలకు జరిగిన అవమానమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కాళ్లు బొబ్బలెక్కేలా తిరిగిన భట్టి కింద కూర్చున్నారని, అది కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమే అయినా చూసేవాళ్లకు బాధ కలుగుతుందని పేర్కొన్నారు. ఇవి ఆధిపత్యవర్గాల ఫ్యూడలిజం వైఖరికి ప్రతిబింబాలుగా కనిపిస్తాయని తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు యాదగిరిగుట్టలో జరిగిన అవమానం తెలంగాణ సమాజానికే సిగ్గుచేటని బీఆర్ఎస్ నాయకుడు తుంగుబాలు ఆవేదన వ్యక్తం చేశారు. భట్టి పాదయాత్ర చేస్తే పదవిలోకి వచ్చిన రేవంత్రెడ్డి దళితులను దగా చేస్తున్నాడని మండిపడ్డారు నక వినయాలు, నాగుపాము విషం, తోడేలు క్రూరత్వం కప్పుకున్న సాధుజీవి రేవంత్రెడ్డి ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ దళిత ద్వేషి అని తేలిపోయిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. తెలంగాణ ప్రజలు, మీడియా, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా సీఎం రేవంత్రెడ్డితోపాటు ఇతర మంత్రులు దళిత సమాజాన్ని అవమానానికి గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత సామాజికవర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమారను అవమానించి కాంగ్రెస్ తన నిజస్వరూపం బయటపెట్టుకున్నదని మండిపడ్డారు. భట్టి రూపంలో యావత్ దళిత జాతిని కాంగ్రెస్ అవమానించిందని ధ్వజమెత్తారు. భట్టి ఏం పాపం చేశారని అవమానించారని ప్రశ్నించారు. సీఎం వెంటనే దళిత జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జన్వాడలో దళితులపై దాడి జరిగితే ఖండించలేదని విమర్శించారు. గురుకులంలో పేద విద్యార్థులు వరుస ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని,. మృతుల కుటుంబాలను ముఖ్యమంత్రి పరామర్శించలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పేద వర్గాలపై ఓట్ల కోసం కపట ప్రేమ ఒలకబోస్తున్నది తప్ప, నిజంగా దళితులపై ప్రేమలేదని, విద్వేషం మాత్రమే ఉన్నదని ఆరోపించారు.
నల్లగొండ: పవిత్ర యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సురేఖను కింద కూర్చోబెట్టడం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అహంకారానికి నిదర్శనమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కుర్చీలు సరిపడా లేనప్పుడు అందరూ నిలబడే పూజ చేయాలని, ఇలా దళిత, బీసీ బిడ్డలను అవమానించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రేవంత్రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నల్లగొండలో జరిగిన బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన కవిత విలేకరులతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీలు, దళితులను రేవంత్రెడ్డి చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటి వరకు బీసీశాఖకు మంత్రి కూడా లేరని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ది కుటుంబ పాలన అని విమర్శించిన కాంగ్రెస్ నేడు నల్లగొండను మూడు కుటుంబాలే ఎందుకు శాసిస్తున్నాయో చెప్పాలని నిలదీశారు.
మహిళా బిల్లు కోసం ఆ రోజు జాగృతి ఆధ్వర్యంలో ధర్నా చేస్తే కేసీఆర్ 47 శాతం ఇస్తున్నారా? అని ప్రశ్నించిన రేవంత్ నేడు ఆడబిడ్డలకు అన్యాయం చేసి 12 నుంచి 20 శాతం మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. నిన్న హనుమంతురావును ఏడిపించిన పెద్దలు ఇప్పుడు మంత్రులు భట్టి, సురేఖను అమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సీఎం రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా డిప్యూటీ సీఎం భట్టికి అవమానం జరగడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం తెలంగాణ భవన్లో కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు దేవీప్రసాద్, వాసుదేవరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రేవంత్రెడ్డి భార్యను పైన కూర్చోబెట్టి బీసీబిడ్డ అయిన మంత్రి కొండా సురేఖను కింద ఎలా కూర్చోబెడతారని ప్రశ్నించారు. దేవుడి దగ్గరే ఇంత అవమానం జరిగితే దళితజాతి ఎకడ చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకోవాలి? అని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ కూడా స్పందించాలని డిమాండ్ చేశారు.