BRS Agitations : మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్(Congress) పార్టీ.. వెయ్యి రోజుల పాలనలో సబ్బండ వర్గాలకు కన్నీళ్లే మిగిలాయని బీఆర్ఎస్(BRS) శ్రేణులు ధ్వజమెత్తాయి. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలతో రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యాలను ఎండగడుతున్నారు నేతలు. వికారాబాద్ జిల్లా నవాబ్పేట్లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సికింద్రాబాద్లో ఎమ్మెల్యే పద్మారావు, సిరిసిల్లలో, దేవరకద్రలో గులాబీ సైన్యం ఆందోళనలు చేపట్టింది.
వికారబాద్ జిల్లా నవాబ్పేటలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేటీఆర్ పిలుపు మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పరిపాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన తీరును సికింద్రాబాద్లో బీఆర్ఎస్ నేతలు వివరించారు. బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో తల్లా మాధవి అనే దివ్యాంగురాలు తన గోడును వెళ్లబోసుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగుల సమస్యలు ఒక్కటి కూడా పట్టించుకోవడం లేదని ఆమె కన్నీటిపర్యంతమైంది. దివ్యాంగుల కోసం ఏం చేసిందో ఈ ప్రభుత్వం చెప్పాలని ఆమె ఎమ్మెల్యే పద్మారావు ముందు తన బాధను పంచుకుంది.
స్థానిక ఎమ్మెల్యేగా మా దివ్యాంగుల సమస్యలను మీరైనా తీర్చాలని పద్మారావు గౌడ్ను కోరింది మాధవి. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన లోని వైఫల్యాలను ఎండగడుతూ.. సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్లో మాజీ కార్పొరేటర్లు రోడ్డపైనే వంట చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

