హైదరాబాద్ : కృష్ణా జలాల పరిరక్షణ కోసం నల్లగొండలో బీఆర్ఎస్(BRS) పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో నేడు నిర్వహించే చలో నల్లగొండ(Chalo Nallagonda) బహిరంగ సభకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్తున్నారు. నల్లగొండ పట్టణ శివారులో నార్కట్పల్లి-అద్దంకి హైవేకు అనుకుని మర్రిగూడ బైపాస్లో విశాలమైన స్థలంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ సభకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు, రైతులు భారీగా తరలివస్తున్నారు. నల్లగొండతోపాటు ఇతర జిల్లాల నుంచి కూడా ప్రజలు తరలిరానుండటంతో సభా ప్రాంగణానికి నలువైపులా జనం చేరుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాహనాల పార్కింగ్ కోసం అన్ని వైపులా ప్రత్యేక స్థలాలను సిద్ధం చేశారు. మరోవైపు సభకు పోలీసు శాఖ 500 మంది సిబ్బందితో బందోబస్తు చేపట్టింది.