రామగిరి(నల్లగొండ) : దేశంలో ఏ రాష్ట్రంలోని లేని విధంగా తెలంగాణలో బ్రాహ్మణులకు సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ అన్నారు.
బుధవారం నల్లగొండలోని రామగిరి సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం బ్రాహ్మణుల ఆత్మగౌరవం నిలిపేలా సీఎం కేసీఆర్ (CM KCR) హైదరాబాద్లో ఆరు ఎకరాల స్థలంలో రూ.12కోట్లతో బ్రాహ్మణ భవనం( Brahmin Bhavan ) నిర్మించారని పేర్కొన్నారు. ఈ నెల 31న జరిగే ప్రారంభోత్సవానికి(Inauguration) తెలంగాణ వ్యాప్తంగా బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.
బ్రాహ్మణ భవనం ప్రారంభోత్సవానికి దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల దేవాలయాల ప్రధానార్చకులు, శైవ, వైష్ణవ పీఠాధిపతులు, తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన దేవాలయాల ప్రధానార్చకులు హాజరవుతున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ హిందూ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రజ్వలించేలా ఆధ్యాత్మిక రంగాన్ని అద్భుతంగా తీర్చిద్దారని ప్రశంసించారు.
పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ (Brahmin Welfare Parishat) ఏర్పాటు చేసి రూ. 200కోట్లు కేటాయించారన్నారు. దీని ద్వారా పేద బ్రాహ్మణుల పిల్లలు విదేశీ విద్యకు ప్రత్యేక నిధులు అందిస్తున్నారని పేర్కొన్నారు. చిన్నతరహా పరిశ్రమల స్థాపనకు రూ. 3నుంచి 10లక్షల వరకు ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 10వేల కుటుంబాలు లబ్ధి పొందాయని అన్నారు. ఆలయాల అభివృద్ధే కాకుండా అర్చకుల సంక్షేమానికి ప్రభుత్వం రూ. 170 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో డీడీఎన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా వైదిక బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పెన్నా మోహనశర్మ , అర్చక, ఉద్యోగ జేఏసీ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు వలివేటి వీరభద్రశర్మ, బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పోచంపల్లి రమణారావు, రామాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ వేణుగోపాల్రావు, జిల్లా బ్రాహ్మణ సంఘం నాయకులు మంగళగిరి ఫణి పాల్గొన్నారు.