హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన దేశంలోనే మొట్టమొదటి బ్రాహ్మణ సదన్ దేశానికే ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆకాంక్షించారు. దేశంలోనే గొప్ప ఆధ్యాత్మిక, ధార్మిక సమాచార కేంద్రంగా వర్ధిల్లాలని, సమాజానికి ధార్మిక దిశానిర్దేశం చేసే కేంద్రంగా రూపుదిద్దుకోవాలని అభిలషించారు. హైదరాబాద్లోని గోపన్పల్లిలో తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ‘తెలంగాణ బ్రాహ్మణ్ సదన్’ను సీఎం కేసీఆర్ ఈ నెల 31న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ప్రగతిభవన్లో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు కేవీ రమణాచారి, ఇతర సభ్యులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. చండీయాగం, సుదర్శనయాగంతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే బ్రాహ్మణ సంఘాల నాయకులు, పీఠాధిపతులు, అర్చకులు, వేదపండితులకు చేయాల్సిన ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. నిత్యం భగవత్ సేవలో నిమగ్నమవుతూ, సమస్త లోక క్షే మాన్ని కాంక్షిస్తూ తమ జీవితాలను ధారపోసే బ్రా హ్మణ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సభ్య సమాజం మీద ఉన్నదని చెప్పారు. స్వరాష్ట్రంలో బ్రాహ్మణ సంక్షేమాన్ని ప్రభుత్వం ప్రాథమ్యంగా ఎంచుకుని పలు పథకాలు అమలు చేయడం వెనక ఇదే తాత్వికత ఇమిడి ఉన్నదని తెలిపారు.
బ్రాహ్మణ సమాజానికి తెలంగాణ భరోసా
ప్రస్తుతం తెలంగాణ ఆధ్యాత్మిక రాష్ట్రంగా మారిందని, దేవాలయాల పునరుజ్జీవంతో రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు విస్తరించాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దీనితో ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణకు ఉపాధి కోసం అర్చకులు, పురోహితులు, వేద పండితులు వలస వస్తున్నారని చెప్పారు. అన్ని వర్గాలతోపాటు బ్రాహ్మణులకూ తెలంగాణ ఉపాధి కేంద్రంగా మారిందని వివరించారు. బ్రాహ్మణ సమాజానికి భరోసా దొరికిందని అన్నారు. తెలంగాణ బ్రాహ్మణ సదన్ దేశానికే ఆదర్శవంతమైన రీతిలో సమగ్ర రీతిలో సమస్త ఆధ్యాత్మిక, ధార్మిక సమాచార కేంద్రంగా పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. సమావేశంలో కేవీ రమణాచారితోపాటు పరిషత్ ఉపాధ్యక్షుడు వనం జ్వాలా నరసింహారావు, సభ్యులు సముద్రాల వేణుగోపాలాచారి, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, వీ మృత్యుంజయశర్మ, పురాణం సతీశ్, మరుమాముల వెంకట రమణశర్మ, బోర్పట్ల హనుమంతాచారి, అష్టకాల రామ్మోహన్, భధ్రకాళి శేషు, సుమలతాశర్మ, సువర్ణ సులోచన, జోషి గోపాలశర్మ, పరిషత్ సభ్య కార్యదర్శి వీ అనిల్కుమార్, పాలనాధికారి రఘురామశర్మ తదితరులు పాల్గొన్నారు.