KTR | పర్రెపడ్డదని మేడిగడ్డ బరాజ్ కాదని.. రేవంత్రెడ్డి బుర్రకని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు సెటైర్లు వేశారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో అర గ్యారంటీ మాత్రమే అమలైందన్నారు. రెండు లక్షల రుణమాఫీ.. వందశాతం అమలైతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అసెంబ్లీలో చెప్పానన్నారు. కాంగ్రెస్కు పరిపాలన చేతకావడం లేదని.. చేతగాని సీఎం రేవంత్రెడ్డి అంటూ విమర్శించారు.
సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు రెగ్యులేషన్ కోసం ఎదురుచూస్తున్నారన్నారు. రాష్ట్రంలో నాలుగు లక్షల పెళ్లిళ్లు అయ్యాయని.. వారికి కల్యాణలక్ష్మి ఇవ్వలేదన్నారు. రూ.7500 రైతుబంధు కాదుకదా.. 75 పైసలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రైతు ప్రమాణపత్రం కేసీఆర్ హయాంలో అడుగలేదని.. రైతుబంధు ఇచ్చామన్నారు. 12 దఫాల్లో రూ.80వేలకోట్లు రైతుల ఖాతాల్లో రైతుబంధు జమైందని వివరించారు. రైతులని బద్నాం చేసు కుట్ర జరుగుతుందని.. రైతులను దొంగల్లా చిత్రీకరించే కుట్రకు ప్రభుత్వం తెరలేపిందని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగం, ఐటీ ఉంటే రైతుబంధు కట్ అంటున్నాడని.. సీఎం రేవంత్ కట్టింగ్ సీఎం అయ్యారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేశారని.. మేడగడ్డకు పర్రెపడడం కాదు.. రేవంత్రెడ్డి బుర్రకి పర్రె పడ్డదని విమర్శించారు.
కోటిన్నర ఎకరాలకి నీళ్లు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టే కాళేశ్వరాన్ని బాగు చేయడం లేదని ఆరోపించారు. ప్రేక్షక పాత్ర కాదు అన్యాయం జరిగితే కోట్లాడాలని పిలుపునిచ్చారు. చిట్టినాయుడు ఏం పీకలేడన్నారు. అతివిశ్వాసం.. చిన్నచిన్న తప్పిదాలతో అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయామని.. కేసీఆర్ దేశాన్ని శాసించే రోజులు మళ్లీ వస్తాయన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయినా.. కేసీఆర్ జపం చేస్తున్నారన్నారు. రాష్ట్రం దివాళా తీసిందని సీఎం చెబుతున్నాడని.. పరిపాలన చేతకాక మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.