మహబూబ్నగర్ : ఆర్థిక పరిస్థితి బాగోలేక ఫతేపూర్ మైసమ్మ దేవాలయం వద్ద కూల్ డ్రింక్స్ విక్రయిస్తూ పాఠశాలకు వెళ్లలేకపోయిన విజయ్ కుమార్ అనే బాలుడు తనను చదివించాలంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వద్ద మొరపెట్టుకున్నాడు. దీంతో స్పందించిన ఆయన మహబూబ్నగర్ పట్టణంలోని రిషి విద్యాలయంలో చేర్పించారు. పేద విద్యార్థిని పాఠశాలల్లో చేర్పించడంపై రాష్ట్రవ్యాప్తంగా మంత్రికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
బాలున్ని స్వయంగా తన వాహనంలో తీసుకునివచ్చి మంత్రి కొత్త దుస్తులు, బూట్లు, సూట్ కేసు, ఇతర వస్తువులన్నింటిని ఇప్పించారు. సోమవారం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన బాలుడు విజయ్కుమార్ను తన అధికారిక వాహనంలోనే పాఠశాలకు పంపించారు. మంత్రే స్వయంగా బాలుడిని తన కారులో ఎక్కించారు. అదే సమయంలో మంత్రిని కలిసేందుకు క్యాంప్ కార్యాలయానికి వచ్చిన ప్రజలు, అధికారులు, టీఆర్ఎస్ నేతలు అభినందనలు తెలిపారు.
చదువుకుంటానని వచ్చిన ఓ నిరుపేద బాలుడి కోసం మంత్రి పడిన తపన వారందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. బాలుడు కన్నీరు పెడుతుంటే మంత్రి తన చేతి రుమాలు తీసి బాలుడి కన్నీళ్లు తూడుస్తున్న చిత్రాలను చూసి తమకు కన్నీళ్లు వచ్చాయని పలువురు పేర్కొన్నారు. ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశం కాగా.. పలువురు మంత్రిని కలిసి అభినందనలు తెలిపారు.