యాదాద్రి భువనగిరి : ఈత నేర్చుకునేందుకు వెళ్లి ఓ బాలుడు మృత్యు ఒడికి చేరాడు. ఈ ఘటన పోచంపల్లి మండలం పెద్దగూడెంలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పెద్ద గూడెం గ్రామానికి చెందిన మక్బుల్ తన కుమారుడు మహ్మద్ రుస్తుం (14)కు ఈత నేర్పించేందుకు సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. వీరి వెంట మరో ఇద్దరు కూడా ఈత కొట్టేందుకు వెళ్లారు. అందరూ ఈత కోసం బావిలోకి దిగిన సమయంలో ఫోన్ రావడంతో మక్బుల్ గట్టుపైకి వచ్చాడు.
అదే సందర్భంలో మక్బుల్ కుమారుడుతో పాటు వెంట వచ్చిన వారిలో ఒకరు కూడా నీటిలో మునిగి పోతుండడంతో బావిలో ఉన్న వ్యక్తి ఇద్దరిలో ఒకరిని కాపాడాడు. మక్బుల్ కుమారుడు మాత్రం నీటిలో మునిగి పోయాడు. బాలుడి కోసం సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి వరకు కూడా బాలుడి శవం దొరకపోవడంతో బావిలో నుంచి నీటిని తోడే పనులు కొనసాగుతున్నాయి. భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలను సమీక్షించారు. బాలుడి మృతితో బాధిత కుటుంబం కన్నీరు మున్నీరు అవుతుండగా.. పెద్దగూడెంలో విషాద చాయలు అలుముకున్నాయి.