కోనరావుపేట, డిసెంబర్ 25: పదమూడేళ్ల బాలుడు(Boy dies) గుండెపోటు(Heart attack)తో మృతిచెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్(Nizamabad)లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నిరుపేద కుటుంబానికి చెందిన తాళ్లపల్లి శంకర్, సరిత దంపతులకు ఇద్దరు కుమారులు జశ్వంత్, సుశాంత్(13) ఉన్నారు. వీరు కూలీ పనిచేస్తూ ఇద్దరు కొడుకులను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. జశ్వంత్ కోనరావుపేట ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతుండగా, సుశాంత్ ముస్తాబాద్ మండలంలోని గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.
ఈ క్రమంలో ఇంట్లో క్రిస్మస్ పండుగ ఉన్న నేపథ్యంలో సుశాంత్ ఇంటికి వచ్చాడు. మధ్యాహ్నం పూట చాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో కుటుంబ సభ్యులు సిరిసిల్ల ఏరియా దవాఖనకు తరలించారు. మార్గమధ్యలోనే సుశాంత్ గుండెపోటుతో మృతిచెందినట్లు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సంతోషంగా పండుగ చేసుకుందమనుకున్న వారి ఇంట్లో ఒక్కసారిగా విషాదం నెలకొంది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ కేతిరెడ్డి అరుణ కోరారు.