హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): వ్యవసాయం తర్వాత అత్యధిక జనాభా ఉపాధి పొందుతున్న చేనేత రంగానికి రాష్ట్ర ప్రభుత్వం దన్నుగా నిలుస్తున్నది. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం నేతన్నల సంక్షేమ పథకాలకు మంగళం పాడటంతోపాటు జీఎస్టీ విధించి వారి ఉపాధిని దెబ్బతీస్తున్నది. వారికిచ్చే సబ్సిడీలను క్రమంగా రద్దు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వారి జీవితాల్లో వెలుగులు నింపేలా పలు పథకాలతో ఆర్థికంగా తోడ్పాటు అందిస్తున్నది. నూలు కొనుగోలు నుంచి తయారైన బట్టను మార్కెటింగ్ చేసేవరకు అన్ని దశల్లో చేయూతనిస్తున్నది. ఫలితంగా పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు లబ్ధిపొందుతున్నారు.
స్వరాష్ట్రంలో మారిన బతుకులు
ఉమ్మడి రాష్ట్రంలో చేనేత కార్మికుల పరిస్థితి దయనీయం. ఉపాధి లేక ఇతర రాష్ర్టాలకు వలసపోవడమే కాకుండా అప్పుల బాధతో అనేకమంది బలవన్మరణాలకు పాల్పడిన ఘటనలు కోకొల్లలు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఆవిర్భవించాక చేనేత కార్మికుల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో నేతన్నల జీవితాలకు బంగారు బాటలు వేసేలా ప్రణాళికలు రూపొందించారు. నూలు సరఫరా దగ్గరి నుంచి వారు తయారు చేసిన వస్ర్తాలకు మార్కెటింగ్ కల్పించే వరకు ప్రభుత్వం అన్ని దశల్లోనూ సహకారం అందిస్తున్నది. నూలు, రంగులు, కెమికల్స్ కొనుగోలుకు 40 శాతం సబ్సిడీ అందించడంతోపాటు పావలా వడ్డీ పథకం, క్రెడిట్ సపోర్ట్ స్కీం అమలు చేస్తున్నది.
ఏడాది పొడవునా చేతినిండా పని
బతుకమ్మ చీరలు, ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమయ్యే వస్ర్తాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫారాలను నేతన్నల ద్వారా తయారు చేయించి వారికి ఏడాది పొడవునా చేతినిండా పని కల్పిస్తున్నారు. ‘నేతన్నకు చేయూత’ పథకం కింద చేనేత కార్మికులు తమ వేతనాల్లో 8 శాతం మొత్తాన్ని పొదుపు చేసుకొంటే అందుకు రెట్టింపు మొత్తాన్ని, అంటే 16 శాతం మొత్తాన్ని ప్రభుత్వం కలిపి అందజేస్తున్నది. ఈ పథకం కింద దాదాపు 30 వేలకుపైగా నేత కార్మికులు లబ్ధి పొందుతున్నారు.
అలాగే రైతు బీమా తరహాలో నేతన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టి నేత కార్మికులు సహజ మరణం పొందినా వారి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నారు. చేనేత మిత్ర పథకం కింద ముడిసరుకు కొనుగోలులో 40 శాతం రాయితీ, రోజువారీ వ్యాపార అవసరాల కోసం జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ద్వారా రుణాలు, పావలా వడ్డీకి రుణం అందించడం వంటి చర్యలతో ఆర్థికంగా నిలదొక్కుకొంటున్నారు. చేనేత కార్మికులతోపాటు పవర్లూమ్ కార్మికులు బాగుండాలనే ఉద్దేశంతో థ్రిఫ్ట్ పథకాన్ని సుమారు 11 వేల పైచిలుకు కార్మికులకు వర్తింపజేశారు.
కేఎంటీపీతో భారీ ఉపాధి అవకాశాలు
నేతన్నలకు ఉపాధి మెరుగుపర్చడంతోపాటు పత్తి రైతులకు ఉపయోగకరంగా ఉండేందుకు 2017లో ప్రభుత్వం వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ (కేఎంటీపీ)ను ఏర్పాటు చేసింది. ఇందులో రూ.11,586 కోట్ల పెట్టుబడులు, 1,13,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ఇప్పటికే దేశ, విదేశాలకు చెందిన 22 కంపెనీలు రూ.3,400 కోట్లతో ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొన్నాయి. రాష్ట్రంలో వస్ర్తాల తయారీలో నైపుణ్యం ఉన్నవారు భారీ సంఖ్యలో ఉండటంతో వారి ఉపాధి కల్పనకు కేఎంటీపీ ఎంతో దోహదపడుతుందనడంలో సందేహం లేదు.
నేతన్న సంక్షేమానికి ముఖ్యమైన పథకాలు