బడంగ్పేట,జూలై20 : గ్రంథాలయంలో పాఠకులకు,విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచాలని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేటలో ఉన్న జిల్లా గ్రంథాలయాన్ని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కప్పాటి పాండు రంగా రెడ్డి, జిల్లా గ్రంథాలయ కార్యదర్శి మనోజ్ కుమార్, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డితో కలిసి మంత్రి సందర్శించారు.
గ్రంథాలయంలో ఉన్న అన్ని రూమ్లను మంత్రి పరిశీలించారు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ వేయడంతో వేలాదిమంది విద్యార్థులు గ్రంథాలయాలలో చదువుకోవడం చూసిన మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. ఇంత తొందరగా ఇంత మంది విద్యార్థులు గ్రంథాలయంకు వచ్చి చదువుకుంటారని ఊహించలేదన్నారు.
గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేసిన రాష్ట్ర గ్రంథాలయం చైర్మన్ శ్రీధర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పాండు రంగారెడ్డిని మంత్రి అభినందించారు. లైబ్రరీలో సౌకర్యాలు ఎలా ఉన్నాయని మంత్రి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
మెడికల్కు సంబంధించిన పుస్తకాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన మరి కొన్ని పుస్తకాలు అందుబాటులో ఉంచితే బాగుంటుందని విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి స్పందిస్తు అవసరం అయిన అన్ని రకాల పుస్తకాలను తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.