Congress | అది మే 20, 2023. శనివారం. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణం చేశారు. మరుసటి రోజు ఆదివారం. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు. సోమవారం నాడు.. సీఎంవో కార్యాలయం నుంచి ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయి. గత ప్రభుత్వం ప్రకటించిన స్కీంలు, ప్రాజెక్టులకు నిధులు నిలిపేస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే గత ప్రభుత్వ పథకాలను రద్దు చేసిన కాంగ్రెస్ చరిత్ర ఇది. సరే, ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలనైనా అమలు చేసిందా? అంటే, అదీ లేదు. దీంతో.. కాంగ్రెస్కు ఓటేసి గత ప్రభుత్వ స్కీంలకు దూరమయ్యామని, కాంగ్రెస్ 5 గ్యారంటీలు కూడా అమలు కావట్లేదని కర్ణాటక ప్రజలు లబోదిబోమంటున్నారు. రెంటికీ చెడ్డ రేవడిగా తమ పరిస్థితి మారిపోయిందంటూ వాపోతున్నారు.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఇలాంటి వాటిపై చిత్తశుద్ధి ఏమీ ఉండదు. కావాల్సింది ఒక్కటే క్రెడిట్. దీనికోసం ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు. ఇదీ కాంగ్రెస్ వైఖరి. పొరుగు రాష్ట్రం కర్ణాటకనే దీనికి తాజా ఉదాహరణ. ఆరు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. గత ప్రభుత్వహయాంలో అమలుచేసిన పథకాలకు, ప్రారంభించిన ప్రాజెక్టులకు, బోర్డులు, కార్పొరేషన్లకు నిధుల విడుదలను నిలిపేసింది. సీఎంగా సిద్ధరామయ్య పగ్గాలు చేపట్టిన వెంటనే మొట్టమొదటగా జారీచేసిన ఆదేశాలు అవే. దీంతో రైతుసాయం కింద గత ప్రభుత్వం అందించిన రూ. 4 వేలు, అన్నదాతలు, వారి కుటుంబ సంక్షేమం కోసం తీసుకొచ్చిన రైతు విద్యానిధి, భూ సిరి, జీవనజ్యోతి తదితర పథకాలు నిలిచిపోయాయని కన్నడ ప్రజలు మండిపడుతున్నారు. కృష్ణ, మహాదయాయి, కావేరీ బేసిన్లో ప్రారంభించిన పలు ప్రాజెక్టులకు, బెంగళూరు సబర్బన్ రైలు ప్రాజెక్టు, మెట్రో రైల్ ప్రాజెక్టుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిధులను నిలిపేసిందని కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ బంగారమైంది. ఎవుసం పండుగైంది. సంక్షేమ పథకాలతో ప్రతి ఇంట్లో ఆనందాలు వెల్లివిరిశాయి. అయితే, కర్ణాటక ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు 6 గ్యారెంటీల పేరిట తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన పథకాలు మంచివైనప్పటికీ, వాటిని కొనసాగిస్తే ఆ క్రెడిట్ ప్రవేశపెట్టినవారికి దక్కుతుందన్న అక్కసు కాంగ్రెస్కు ఎప్పుడూ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిపుణుల ప్రశంసలు అందుకొన్న సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్తు, అన్నదాతలకు పెట్టుబడిసాయం అందించే ‘రైతుబంధు’పై కాంగ్రెస్ నేతలు విషం చిమ్మడమే దీనికి ఉదాహరణగా చెప్తున్నారు. వ్యవసాయానికి 3 గంటల విద్యుత్తు చాలంటూ రేవంత్ వ్యాఖ్యలు చేయడం, రైతుబంధు నిధులు నిలిపేయడానికి ఈసీకి లేఖలు రాయడం కాంగ్రెస్ నిజస్వరూపాన్ని తెలియజేస్తున్నట్టు చెప్తున్నారు.
తెలంగాణలో ఒకవేళ ఆ పార్టీ కి ఓటేస్తే రైతుబంధు, దళితబంధు, 24 గంటల విద్యుత్తు, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మీ/షాదీ ముబారక్, రైతుబీమా, బీసీబంధు, కంటివెలుగు వంటి పథకాలతో పాటు చివరిదశలో ఉన్న పలు ప్రాజెక్టులకు నిధులు ఆగిపోతాయి.
గత ప్రభుత్వ పథకాల అమలుకు మోకాలడ్డిన కాంగ్రెస్.. ఎన్నికల్లో ఇచ్చిన 5 గ్యారెంటీలనైనా సరిగ్గా అమలు చేస్తున్నదా? అంటే.. అదీలేదు. పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా గృహ వినియోగదారులందరికీ 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తామని హామీనిచ్చిన ‘గృహజ్యోతి’, మహిళలకు ఆర్టీసీ బస్సులో పూర్తిగా ఉచిత ప్రయాణం కల్పిస్తామంటూ తీసుకొచ్చిన ‘శక్తి’, ప్రతి ఇంట్లో మహిళా యజమానికి బ్యాంకు ఖాతాలో నెలకు రూ. 2 వేల చొప్పున జమ చేస్తామన్న ‘గృహలక్ష్మి’, నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేల భృతి ఇస్తామన్న ‘యువనిధి’, ప్రతి వ్యక్తికి నెలకు 10 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం సరఫరా చేస్తామంటూ చెప్పిన ‘అన్నభాగ్య’ వంటి ఐదు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ చేతులెత్తేసింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించి, ఆరు నెలలు గడిచినా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ను కూడా విడుదల చేయలేదు. దీనిపై మీడియా ప్రశ్నించగా.. ‘ఐదేండ్లు ఉందిగా.. అప్పుడు చూద్దాంలే’ అంటూ సీఎం సిద్ధరామయ్య మాటమార్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు సాయంగా ఇచ్చే రూ. 4 వేలు, అన్నదాతలు, వారి కుటుంబం సంక్షేమం కోసం తీసుకొచ్చిన రైత విద్యానిధి, భూ సిరి, జీవనజ్యోతి తదితర పథకాలు రద్దయ్యాయి. ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి.
– కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై