సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్, నవంబర్ 20: మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతోనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు, పట్టణానికి మహర్దశ వచ్చిందని, నాడు ఉరిసిల్లగా ఉన్న సిరిసిల్ల నేడు సిరుల ఖిల్లాగా వర్ధిల్లుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. కార్మికులను యజమానులుగా చూడాలన్న లక్ష్యంతో వర్క్ టూ ఓనర్ పథకంలో భాగంగా రెండో బైపాస్ రోడ్డులో అపెరల్ పార్కును ఏర్పాటు చేస్తున్నామని, త్వరలోనే సిరిసిల్లలో లా కళాశాల ఏర్పాటు చేస్తాంమని వినోద్కుమార్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో సోమవారం సిరిసిల్ల పట్టణ బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న వినోద్కుమార్ మాట్లాడుతూ.. బూత్స్థాయి సభ్యులు ఇంటింటికీ వెళ్లి కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించాలని, కాంగ్రెస్ నాయకులు చెప్పే కల్లబొల్లి మాటలను తిప్పికొట్టాలని సూచించారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే సీఎం కావడంతో రైతుల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వ్యవసాయాన్ని పండుగలా చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మూడు గంటల కరెంట్ చాలంటూ.. వ్యవసాయంపై కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. 10 హెచ్పీ మోటర్లు వ్యవసాయానికి వినియోగిస్తారా అంటూ ఎద్దేవా చేశారు.
మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో సిరిసిల్ల డివిజన్ కేంద్రం జిల్లాగా మారిందని తెలిపారు. ఒకప్పుడు వరంగల్, హైదరాబాద్ వంటి మహా నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఇంజినీరింగ్, మెడికల్ విద్య.. నేడు సిరిసిల్ల పిల్లలకు చేరువైందని చెప్పారు. అలాగే నర్సింగ్ కళాశాల, వ్యవసాయ, వ్యవసాయ పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాల, గంభీరావుపేటలో కేజీ టూ పీజీ విద్యాలయాల సముదాయం ఏర్పాటు కావడంతో సిరిసిల్ల ఎడ్యుకేషన్ హబ్గా మారిందని వివరించారు. తెలంగాణకే తలమానికంగా మంత్రి కేటీఆర్ సిరిసిల్లను తీర్చిదిద్దారని, ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.