హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): విద్య, వైద్యారోగ్యం, పోషకాహారంపై ప్రత్యేక సర్వే నిర్వహించాలని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర అర్థ గణాంక, ప్రణాళికాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో విద్య, వైద్యం, పోషకాహారం ఎలా అందుతున్నాయనే విషయంపై ప్రత్యేక సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. దీనికోసం ప్రతిష్ఠాత్మక సంస్థల సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చారు.
ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్య, వైద్యారోగ్యం, పోషకాహారం అమలు తీరుతెన్నులపై సూక్ష్మస్థాయిలో పరిశీలించి, పక్కాగా నివేదికలు రూపొందించాలని సూచించారు. ఈ సర్వే నివేదికల ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని శాఖలకు విస్తరించే అంశాన్ని పరిశీలించాలని నిర్ణయించారు.
విద్య, వైద్యారోగ్యం, పోషకాహారం, హౌస్హోల్డ్ సర్వే, పాఠశాలల్లో విద్యాబోధనపై తొలి దశలో సర్వే నిర్వహించనున్నారు. ఇందుకు విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. సమావేశంలో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళికాశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ, విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, అర్థగణాంకశాఖ డైరెక్టర్ దయానంద్, టీఎస్డీపీఎస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామకృష్ణ, కాకతీయ గవర్నెన్స్ ఫెలోషిప్, సీజిస్, కేపీఐ సర్వే ప్రతినిధులు పాల్గొన్నారు.