హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): వానకాలం సీజన్ రైతుబంధు నిధులను జూన్ మొదటివారంలోనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు ఎకరాకు రూ.7,500 చొప్పున విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. యాసంగి పంట రైతుబంధు డబ్బులను పంట కోతకు వచ్చే సమయంలో ఇచ్చారని, వానకాలం పంటకు అలా జరగకుండా చూడాలని కోరారు. శనివారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. రైతుబంధు ముఖ్య ఉద్దేశమే పంట సాగుకు ముందే అవసరమైన పెట్టుబడి సాయాన్ని అందించి, రైతులకు అండగా నిలబడటమని చెప్పారు. మే చివరి వారంలో రోహిణీ కార్తెలో తొలకరి జల్లులు వస్తాయని, అప్పటినుంచే పంట సాగు పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఆ సమయంలో రైతులు పెట్టుబడి గురించి తీవ్ర ఆవేదన, ఆందోళనతో ఉంటారని, పెట్టుబడి కోసం ప్రైవేట్ వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు, బ్యాంకుల చుట్టూ తిరుగుతారని తెలిపారు.
ప్రభుత్వ సాయం సరియైన సమయంలో అందితేనే వారికి ఉపశమనం లభిస్తుందని చెప్పారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలు, ఇతర వ్యవసాయ పనుల కోసం రైతులు ఆ డబ్బును వాడుకుంటారని వివరించారు. ఈసారి వర్షాలు ముందే కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో క్యాబినెట్ భేటీలో రైతుబంధుపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసాను అమలు చేస్తుందా? రైతుబంధును అమలు చేస్తుందా? అని ప్రశ్నించారు. రైతులు పండించిన పంటలకు ఇస్తామన్న బోనస్ పథకాన్ని బోగస్ పథకంగా మార్చొద్దని హితవు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం సన్న వడ్లకే బోనస్గా రూ.500 ఇస్తామనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పోలింగ్కు రెండు రోజుల ముందు ఈ మాట అని ఉంటే, కాంగ్రెస్కు అన్ని స్థానాల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కేవి కావని చెప్పారు.
తెలంగాణలో ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వానకాలంలోనే ఎక్కువ సన్న వడ్లు పండుతాయని, వానకాలంలోనూ 40% రైతులు మాత్రమే సన్న వడ్లు పండిస్తారని తెలిపారు. దీంతో మెజార్టీ రైతులకు రూ.500 బోనస్ పొందే అవకాశం ఉండదని ఆం దోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ అందించాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యం రైతుల దగ్గర ఎంత ఉన్నా ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. ప్రభుత్వ పనితీరును ప్రజలు బేరీజు వేయడానికి, గ్రేడింగ్ ఇవ్వడానికి మొదటి ఆరు నెలలు చాలా కీలకమని, రేవంత్రెడ్డి ఈ ఆరు నెలల్లో తన ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం అని చెప్పుకోవడానికి ఏ ఒక్క పథకం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని, ఇచ్చిన హామీలను, ప్రజా సమస్యలను పరిష్కరించాలని హితవు చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ఎం శ్రీనివాస్రెడ్డి, తుల ఉమ, భూపతిరెడ్డి, గట్టు రాంచందర్రావు పాల్గొన్నారు.