హైదరాబాద్ : జమిలి ఎన్నికలపై అధ్యయనం కోసం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్తో కమిటీ వేయడం ఆశ్చర్యకరంగా ఉందని, ఆకమిటీలో అంతా ఉత్తర భారత దేశ సభ్యులు మాత్రమే ఉన్నారనీ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణ భారత దేశం నుంచి ఒక్కరూ కూడా లేకపోవడం శోచనీయమన్నారు.
అయిదు రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టీ ప్రధాని మోదీ దేశాన్ని గందరగోళ పరిస్థితులోకి నెట్టారని వినోద్ కుమార్ ఫైర్ అయ్యారు. NDA సర్కార్ పదేళ్లుగా మాట్లాడకుండా ఇప్పుడు హడావుడిగా పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. 2018లోనే జమిలి ఎన్నికలపై BRS అభిప్రాయం చెప్పామని గుర్తు చేశారు. జమిలి ఎన్నికలు మంచిదే కానీ.. చర్చ జరగాలని లా కమిషన్ కు స్పష్టం చేశామన్నారు.
మోదీకి తప్పా.. బిజెపిలో ఉన్న వారికి కూడా ఏమి జరుగుతుందో తెలియడం లేదని విమర్శించారు. జమిలి ఎన్నికలపై ఇప్పటికే రిపోర్ట్ రెడీ అయ్యి ఉందా ? ఇప్పుడు వేసిన కమిటీ నామ్ కే వాస్తే కమిటా అన్న అనుమానం తనకు ఉందన్నారు. మోదీ దేశాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏపీ విభజన చట్టంలో రెండు రాష్ట్రాల అసెంబ్లీ లలో శాసన సభలో సభ్యుల సంఖ్య పెంచాలని ఉంది. కానీ, మోదీ సర్కార్ పట్టించుకోలేదని గుర్తు చేశారు.
ఇక చిన్న సవరణతో తెలుగు రాష్ట్ర అసెంబ్లీలలో సభ్యుల సంఖ్య పెంచవచ్చని కానీ.. ఆ విషయాన్ని మోదీ సర్కార్ ఇప్పటి వరకు పెట్టించుకొలేదని మండిపడ్డారు. జమిలి ఎన్నికలకు 5 రాజ్యాంగ సవరణలు అవసరం ఉన్నా ముందుకు వెళుతున్నారు కానీ.. విభజన చట్టంలో ఉన్న ఈ అంశంపై మాత్రం ఎందుకు దృష్టి పెట్టలేదని ప్రశ్నించారు. ఇక మహిళ రిజర్వేషన్ల బిల్లు విషయంలో పదేళ్లు మోదీసర్కార్ చేసింది ఎంటీ అని సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల కోసం గందరగోల పరిస్థితి బిజెపి ప్రభుత్వం దేశంలో సృష్టిస్తుంది విమర్శించారు. జమిలి ఎన్నికల అంశం.. తాజా పరిణామాలపై BRSలో చర్చిస్తామని స్పష్టం చేశారు.