రాజన్న సిరిసిల్ల : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై దయాదాక్షిణ్యం లేకుండా కఠినంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్(Boinapalli Vinodkumar) ధ్వజమెత్తారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని శ్రీరాజరాజేశ్వర జలాశయంలో (Rajarajeswara reservoir( నీళ్లు లేక తేలిన శాబాష్పల్లె రోడ్డు, బీటలు వారిన భూమిని పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రైతులు సాగునీరు లేక తల్లడిల్లుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతులపై కాఠిన్యంగా వ్యవహరిస్తూ సాగునీరు ఇవ్వడం లేదని మండిపడ్డారు.
గోదావరిలో రోజురోజుకూ వేల క్యూసెక్కుల నీరు వృథాగా పోతూ సముద్రంలో కలిసిపోతుందన్నారు.
మేడిగడ్డ వద్ద రక్షణ చర్యలు చేపడితే రైతులకు ఈ విధమైన పరిస్థితి వచ్చేది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను, ప్రాజెక్టులను గాలికి వదిలేసి అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్పై అసత్య ఆరోపణలు చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు చేతగానితనం, అసమర్థత కారణంగానే మేడిగడ్డ దగ్గర ఉన్న వేల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతుందన్నారు.
ఎండిన పంట పొలాలను సర్వే చేయించి ఎకరాకు రూ.25 వేల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు బోయినపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ సత్తినేని భాగ్యలత మాధవ్, జిల్లా నాయకులు చెన్నాడి అమిత్కుమార్, వైస్ ఎంపీపీ నాగయ్య, మండలాధ్యక్షుడు కొండయ్య, నాయకులున్నారు.