శంకరపట్నం, ఆగస్టు 27: పోరాటాలతో సిద్ధించిన తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలన అందిస్తున్నారని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. ప్రధాని మోదీ ఇందుకు భిన్నంగా ప్రచార అర్భాటం చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్లో నిర్వహించిన బీఆర్ఎస్ యువగర్జన సభలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ.. చంద్రయాన్-3ని విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని ఈ ఘనతను తనదిగా చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. కర్ణాటకలో ఇస్రో సైంటిస్టుల సత్కార సభకు సీఎం సిద్ధరామయ్యను ఆహ్వానించక పోవడం బాధాకరమని అన్నారు. గతంలో వ్యాక్సిన్ ఆవిష్కరణ సందర్భంగా సీఎం కేసీఆర్ విషయంలోనూ ఇలాగే వ్యవహరించారని గుర్తుచేశారు. మత రాజకీయాలు చేసి, ప్రజలను తప్పుదోవ పట్టించి కరీంనగర్ పార్లమెంట్లో విజయం సాధించారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనంతా చీకటిమయమని విమర్శించారు. 1969 తెలంగాణ ఉద్యమంలో 369 మందిని పిట్టల్లా కాల్చి చంపిన చీకటి చరిత్ర ఆ పార్టీదేనని ఆయన ఆరోపించారు. అలాంటి పార్టీని నమ్మితే అధోగతిపాలుకాకతప్పదని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. ఎమ్మెల్యే రసమయి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ భవిష్యత్తు యువత చేతిలోనే ఉన్నదని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు పాల్గొన్నారు.