హైదరాబాద్, జూన్1(నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఢిల్లీలో తొలిసారి అధికారికంగా నిర్వహిస్తున్న కేంద్రప్రభుత్వం విభజన హామీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం మంత్రుల నివాసంలో రాష్ట్రంలోని వివిధ మారెట్ కమిటీల నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో వినోద్కుమార్ మాట్లాడారు. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని కేంద్రప్రభుత్వం అధికారికంగా నిర్వహించడాన్ని ఆయన స్వాగతించారు. ఎనిమిదేండ్లు గడుస్తున్నా విభజన చట్టంలోని అనేక అంశాలు ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదని అన్నారు.
రాష్ట్ర విభజన నాడు ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాపై ఉన్నదని చెప్పారు. తెలంగాణలోని కాళేశ్వరానికి కానీ,పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కానీ కేంద్రం ఇప్పటి వరకు జాతీయ హోదా ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. బయ్యారంలో ఉక్కుఫ్యాక్టరీని నెలకొల్పాలని, నిజామాబాద్లో పసుపుబోర్డును ఏర్పాటు చేయాలని, జిల్లాకో నవోదయ పాఠశాలను మంజూరు చేయాలని వినోద్కుమార్ డిమాండ్ చేశారు. కాజీపేటలో రైల్వే కోచ్ఫ్యాక్టరీని ఏర్పాటు చేయకుండా.. ఉత్తరాది రాష్ర్టాలకు మోదీ ప్రభుత్వం మంజూరు చేసిందని విమర్శించారు.
గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ కేంద్రం హైదరాబాద్కు మంజూరు కాగా దాన్ని కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వం గుజరాత్లోని జామ్నగర్కు తరలించిందని చెప్పారు. దేశవ్యాప్తంగా 150 వైద్యకళాశాలలను ఏర్పాటు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణకు మాత్రం ఒక్క మెడికల్ కళాశాలనూ మంజూరు చేయలేదని విమర్శించారు. ఐటీఐఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్, మెగా పవర్ పార్, టెక్స్టైల్ క్లస్టర్ వంటి సంస్థల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నదని వినోద్ కుమార్ విమర్శించారు.