హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): గాంధీ దవాఖానలో మృతదేహాలను భద్రపరచే 90 ఫ్రీజర్ బాక్సుల్లో 82 పనిచేస్తున్నాయని, మిగిలిన వాటికి మరమ్మతులు చేయించడంతో అవి కూడా వినియోగంలో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఆ దవాఖానలోని మొత్తం 90 ఫ్రీజర్ బాక్సుల్లో 15 మాత్రమే పనిచేస్తున్నాయంటూ ఓ పత్రికలో వచ్చిన వార్తను సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి హైకోర్టు విచారణ జరిపింది.
ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదన వినిపిస్తూ మొత్తం 90 ఫ్రీజర్ బాక్సులు పనిచేస్తున్నాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనానికి తెలిపారు. దీనికి సంతృప్తి చెందిన ధర్మాసనం ఈ పిల్పై విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించింది.