Free Bus for Women | హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి వచ్చిన నేపథ్యంలో వీధినపడ్డ ఆటో డ్రైవర్లకు ఉపాధి చూపించాలని డిమాండ్ చేస్తూ ఆటో యూనియన్లు పోరుబాట పడుతున్నాయి. ఇప్పటికే పలు సంఘాలు వివిధ కార్యక్రమాలకు వేర్వేరుగా పిలుపునిచ్చాయి. ఈ నెల 16 నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు, తహసిల్దార్లు, బస్ డిపో మేనేజర్లకు వినతిపత్రాలు అందజేయాలని బీఎంఎస్ ఆటో అండ్ ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్ పిలుపునిచ్చింది. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించకపోతే ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించింది. మరోవైపు ఈ నెల 19న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్టు తెలంగాణ ఆటో మోటర్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ తెలిపింది. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని శ్రమశక్తి భవన్లో బీఎంఎస్ ఆటో అండ్ ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు రవిశంకర్ మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు ప్ర యాణం ఆటో డ్రైవర్ల ఉపాధిపై పిడుగుపాటుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆనాడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు హైదరాబాద్ నగరంలోకి ఆటోలను రానియ్యకుండా డ్రైవర్లను వేధించారనీ, నేడు సీఎం రేవంత్రెడ్డి ఆటో డ్రైవర్ల భవిష్యత్నే కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ల బతుకులకు ప్రభుత్వం భరోసా చూపకపోతే భవిష్యత్ కార్యాచరణ ఉధృతంగా ఉంటుందని హెచ్చరించారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామన్న కాంగ్రెస్.. రోజూ వెయ్యి సంపాదించే ఆటో డ్రైవర్ల ఉపాధికి గండి కొట్టిందని విమర్శించారు. పార్టీలు, జెండాలు, విభేదాలు పక్కనపెట్టి ఆటో సంఘాలన్నీ ఏకం కావాలని గ్రేటర్ ఆటో యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ముదిరాజ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రేటర్ ప్రధాన కార్యదర్శి కిషన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఆటో డ్రైవర్ల బతుకు నాశనం:వేముల మారయ్య
కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత విధానాలతో రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది ఆటో డ్రైవర్ల బతుకు నాశనమైందని తెలంగాణ ఆటో మోటర్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఉపాధి చూపించాలని కోరుతూ శుక్రవారం నాచారంలోని ఆటో అడ్డా వద్ద యూనియన్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వేముల మారయ్య మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ల సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 19న బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అన్ని యూనియన్లతో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. మేధావులు ఆటో డ్రైవర్ల సమస్యలపై స్పందించి తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్లో ఒక్కో అడ్డా మీద వందకుపైగా ఆటోలు ఉండేవని ఇప్పుడు 20 ఆటోలు ఉండటమే గగనంగా మారిందని చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఆటో సంఘాలతో చర్చలు జరిపి ఉపాధి చూపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు డీ శ్రీనివాస్, పాండునాయక్, శాతం రమేశ్, చిన్నంబాల నరసింహ, హైమద్బాయ్, నిరంజన్, రాజు మార్, అనీఫ్, అశోక్, ఎల్ రవి తదితరులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్ పట్టించుకోలేదు
ప్రజాభవన్లో సీఎం రేవంత్రెడ్డికి ఆటో సమస్యలపై వినతిపత్రం ఇస్తే రెండు సెకన్లు కూడా చూడలేదు. సమస్య చెప్పడానికి ప్రయత్నిస్తే పట్టించుకోలేదు. నేను వినతిపత్రం అందించినట్టు నాకు సందేశం కూడా రాలేదు. ఆటో డ్రైవర్ల సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవాలి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై పునరాలోచన చేయాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆటోల సేవలను వినియోగించి వారికి ఉపాధి కల్పించాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతాం. ఆటో డ్రైవర్లను వేధించిన చంద్రబాబు విధానాలను రేవంత్ అనుసరిస్తున్నారు.
-మహ్మద్ హబీబ్, ఆటో డ్రైవర్