హైదరాబాద్: అంధత్వ రహిత సమాజమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని విక్టోరియా గ్రౌండ్, నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని విజయనగర్ కాలనీలో గల ఫుట్ బాల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలను మంత్రి మంగళవారం సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కంటి చూపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి కోసమే ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఉచితంగా కంటి పరీక్షలు, మందులు, కళ్ళద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అవసరమైన వారికి కంటి శస్త్రచికిత్సలు కూడా ఉచితంగానే నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.