హైదరాబాద్ : అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా కంటి వెలుగు రెండవ దశ కార్యక్ర కార్యక్రమం ఈనెల 18 నుంచి ప్రారంభం కానుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో కంటి వెలుగు 2 కార్యక్రమం నిర్వహణ, ఏర్పాట్లపై హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి హైదరాబాద్ జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ కార్యక్రమం తలపెట్టినా ప్రజల పక్షాన ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. రెండవ విడత కంటి వెలుగు కోసం ప్రభుత్వం 250 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 91 వార్డు లలో 115 శిబిరాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శిబిరాల ఏర్పాటుకు కమిటీ హాల్స్, మల్టి పర్ఫస్ ఫంక్షన్ హాల్స్, ఇతర ప్రభుత్వ భవనాలు, మున్సిపల్ గ్రౌండ్ లను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.
55 లక్షల మందికి కంటి అద్దాలు
శిబిరాల వద్ద సరైన పర్నిచర్, విద్యుత్ సౌకర్యం, టాయిలెట్స్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి టీం లో ఒక డాక్టర్, ఒక కంటి వైద్యుడు, ఒక పార్మసిస్ట్, ఆశా వర్కర్ లతో కలిపి 10 మంది వరకు ఉంటారని మంత్రి తెలిపారు. కంటి వెలుగు గిన్నిస్ బుక్ లో నమోదయ్యే విధంగా రాజకీయాలకు అతీతంగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. కోటిన్నర మందికి పరీక్షలు చేసి 55 లక్షల మందికి అద్దాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. కంటి ఆపరేషన్ లు అవసరమైన వారికి సరోజినీ దేవి, LV ప్రసాద్ హాస్పిటల్స్ మాత్రమే కాకుండా లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్ ఇతర స్వచ్చంద సంస్థల కు చెందిన హాస్పిటల్స్ సేవలను కూడా వినియోగించుకొనే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొనే విధంగా విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, సురభి వాణిదేవి, స్టీఫెన్ సన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, సాయన్న, రాజాసింగ్, కౌసర్ మొహినోద్దిన్, కార్పొరేషన్ చైర్మన్ లు రావుల శ్రీధర్ రెడ్డి, ఎర్రోళ్ళ శ్రీనివాస్, గజ్జెల నగేష్, నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న, కలెక్టర్ అమయ్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, అధికారులు పాల్గొన్నారు